ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా ..? : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2024, 03:48 PM

నువ్వు చేసే అక్రమాలకు చిడతలు వాయించాల్న అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. లగచర్ల కేసులో అరెస్టయిన కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని హరీశ్‌రావు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ పగ ప్రతీకారంతో పట్నంను కుట్రపూరితంగా నరేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయించారని ఆరోపించారు. కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైందని.. ఈ అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మీకు ఓటేస్తే మేలు జరుగుతుందనుకుంటే పాపానికి.. లగచర్ల గ్రామం భూములను గుంజుకోవడమే నువ్వు చేసే మేలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు.ఎక్కడ ఏం జరిగినా బీఆర్‌ఎస్‌పై  పెడుతున్నారన్నారు. నిరుద్యోగులు, రైతులు, పోలీసులు స్వచ్ఛందంగా ధర్నా చేస్తే అది బీఆర్‌ఎస్‌ చేయించిందని రేవంత్ అంటున్నారని.. రేవంత్ సొంత నియోజకవర్గంలో తమ భూముల కోసం గిరిజనులు పోరాటం చేస్తే అది కూడా బీఆర్‌ఎస్‌ చేసిందనే అంటున్నారన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడడం ప్రతిపక్షాలుగా మా బాధ్యత అన్నారు. మమ్మల్ని అక్రమంగా కేసులు పెట్టాలనుకుంటున్నావేమో .. మాపై కోపం ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి‌.. కానీ అమాయక గిరిజన రైతులపై కేసులెలా పెడతారని సీఎంని ప్రశ్నించారు. వెంటనే గిరిజన రైతులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా ..? ప్రజాస్వామ్యమెక్కడుంది అంటూ నిలదీశారు.


 


మల్లన్నసాగర్‌లో రేవంత్‌ రెండురోజులు నిరసన చేస్తే మేం అడ్డుకున్నమా.. ? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి మహిళల చాతిమీద కాళ్లు పెట్టి అరెస్టులు చేయడం సరికాదన్నారు. ఈ ప్రజల తిరుగుబాటు ఆగదని.. రేవంత్‌ని గద్దె దించే దాకా నిద్రపోమన్నారు. మా ప్రభుత్వంలో 14వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించామని.. అక్కడెందుకు ఫార్మాసిటీ కట్టరని ప్రశ్నించారు. ఇందిరమ్మ ముసుగులో దళితుల, గిరిజనుల భూములు గుంజుకుంటున్నారని.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన ఇప్పుడు కనిపిస్తోందన్నారు. రైతుల భూములు గుంజుకోవడమే ఇందిరమ్మ పాలన అని నిలదీశారు. రేవంత్‌ పాలన అదానీ, తమ్ముళ్లు, అల్లుళ్ల కోసమేనని.. బీఆర్‌ఎస్‌ పార్టీ దళిత, గిరిజనుల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు.


కేటీఆర్‌పై సైతం కుట్రలు చేస్తున్నారని.. ఆ రోజు మల్లన్నసాగర్‌లో నీ మీద కేసులు పెట్టినమా అంటూ సీఎం రేవంత్‌ను హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించామని.. నరేందర్ రెడ్డికి ఏ సంబంధం లేదన్నారు. రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందో తెలియదని.. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడానికి ఒక్క నిముషం ముందు ఒత్తిడి చేసి నరేందర్‌రెడ్డితో సంతకం చేయించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి బడాబాబులపై ప్రేమ ఉందన్నారు. నరేందర్‌రెడ్డి ధైర్యంగా ఉన్నారని.. ఆయనకు బీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తుందన్నారు. ధర్మమే గెలుస్తుందని.. న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందన్నారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa