ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రీజనల్‌ రింగు రోడ్డు దక్షిణభాగం.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2024, 09:12 PM

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయటానికి రీజినల్ రింగు రోడ్డు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు 40. కి.మీ దూరం నుంచి ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి సూపర్ గేమ్ ఛేంజర్ అని.. రింగు రోడ్డు అందుబాటులోకి వస్తే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్రం నుంచి నేషనల్ హైవే హోదా లభించింది. దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ విషయంలో ప్రస్తుతం కసర్తతు జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.


ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటిదాకా పబ్లిక్‌-ప్రైవేట్‌-పార్ట్‌నర్‌షిప్‌, హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌, బిల్డ్‌-ఆపరేట్‌-టోల్‌  పద్ధతులను పరిశీలించిన రేవంత్ ప్రభుత్వం.. తాజాగా ‘ఇన్‌విట్‌’ విధానంపై ఫోకస్ పెట్టింది. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం నిర్మాణం విషయంలో ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇన్‌విట్‌ విధానం అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్ట్‌. రహదారి నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను బాండ్ల రూపంలో సేకరించే విధానమే ఇన్‌విట్. ఏ ప్రాజెక్టు కోసం ఈ నిధులను సేకరిస్తున్నారో.. అదే ప్రాజెక్టుకు నిధులను పూర్తిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా ఖర్చు చేస్తే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కూడా వర్తించదని అధికారులు చెబుతున్నారు. సర్కార్ చేపట్టే ప్రాజెక్టు నుంచి వచ్చే ఆదాయంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన రుణాన్ని తీర్చాల్సి ఉంటుంది.


ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల్లో ఇన్‌విట్‌ విధానంలోనే రహదారులు నిర్మిస్తున్నారు. ఈ పద్ధతిలో నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయంలో కొంత ప్రైవేటు సంస్థల నుంచి నిధులు సేకరిస్తారు. మరికొంత మొత్తాన్ని బాండ్ల రూపంలో సేకరించనున్నారు. ఈ పద్ధతిలో ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే.. టోల్‌ ద్వారా ఎంత ఆదాయం వస్తుందనే విషయాన్ని ముందుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాతే ప్రైవేటు సంస్థలు నిధులను అందించనున్నారు. ఆ తర్వాత నిధులు అవసరమైతే వాటిని బాండ్ల రూపంలో సేకరించనున్నారు. అలా తీసుకున్న బాండ్లకు.. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత టోల్‌ ద్వారా, రహదారికి ఇరువైపులా ఏర్పాటుచేసే వాణిజ్య, వ్యాపార సముదాయాల ద్వారా వచ్చే ఇన్‌కం నుంచి కొంత మొత్తాన్ని క్రమంగా చెల్లించనున్నారు. ఈ విధానంలో అయితే ప్రభుత్వంపై ఆర్ధికభారం ఉండదని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.


ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం చౌటుప్పల్‌ దగ్గర ప్రారంభమై ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి మీదుగా సంగారెడ్డిలోని ఉత్తర భాగానికి అనుసంధానం కానుంది. ఈ మార్గాల్లో చేపట్టే వెహికల్‌ అండర్‌ పాస్‌, రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, క్రాసింగ్‌, జంక్షన్లు తదితర నిర్మాణాలపై డీపీఆర్‌ రూపొందించేందుకు ఒక కన్సల్టెంట్‌ను త్వరలోనే నియమించనున్నారు. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa