ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీసీఐ మహిళల వన్డే ట్రోఫీ.. కరీంనగర్‌ అమ్మాయికి బంపర్ ఆఫర్.. తొలి క్రికెటర్‌గా రికార్డు..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2024, 06:22 PM

బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ కోసం తలపడనున్న హైదరాబాద్ తుది జట్టులో కరీనంగర్‌కు చెందిన అమ్మాయికి స్థానం దక్కింది. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శనివారం (నవంబర్ 16న) సమావేశమైన బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ.. 15 మంది క్రీడాకారిణిలతో కూడిన తుది జట్టును ప్రకటించింది. ఈ జట్టులో కరీంనగర్ జిల్లాకు చెందిన కట్ట శ్రీవల్లి స్థానం దక్కించుకుంది. కట్ట శ్రీవల్లి పాస్ట్ బౌలర్‌గా జట్టు తరపున ఆడనుంది.


కరీంనగర్‌లోని బొమ్మకల్, శ్రీపురం కాలనీకి చెందిన కట్ట ఉమారాణి, లక్ష్మారెడ్డి దంపతుల చిన్న కూతురు కట్ట శ్రీవల్లి. శ్రీవల్లి మూడో తరగతి చదువుతున్నప్పుడు తోటి స్నేహితురాలితో కలిసి క్రికెట్ ఆడుతూ ఆటపై ఆసక్తి పెంచుకుంది. 5వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్ యాజమాన్యం అనుమతి తీసుకుని మరీ అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. ఆటపై ఆమెకు ఉన్న మక్కువను గమనించిన పీఈటీ రహీం శ్రీవల్లికి ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చారు. పాఠశాల యాజమాన్యం అనుమతి తీసుకుని మధ్యాహ్నం 3.30 గంటల నుంచి క్రికెట్ ప్రాక్టీస్ చేసేది.


క్రికెట్‌లోనే కాదు చదువులోనూ ప్రతిభ చూపించే శ్రీవల్లి.. పదో తరగతిలో 87 శాతం మార్కులు సాధించింది. రెగ్యులర్ కాలేజీలో చదివితే.. క్రికెట్ ప్రాక్టీస్ కొనసాగించడం సాధ్యం కాదు కాబట్టి.. ఆమె తల్లిదండ్రులు ఓపెన్ ఇంటర్మీడియట్ కోర్సులో చేర్పించారు. ఆమె ఇప్పుడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదవుతోంది.


శ్రీవల్లి 2019లో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో జరిగిన జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో ఆడింది. 2022లో పూణేలో జరిగిన పోటీలో హెచ్‌సీఏ అండర్-19 జట్టు తరఫున ఆడింది. తన తల్లిదండ్రులు, కోచ్‌ సహకారంతో హైదరాబాద్‌ జట్టులో స్థానం సంపాదించగలిగానని శ్రీవల్లి చెప్తోంది. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ మహిళా బౌలర్‌గా అవతరించడమే తన లక్ష్యమని తెలియజేస్తూ.. లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడతానని చెప్పింది.


తన కూతురు హైదరాబాద్ జట్టుకు ఎంపిక కావడం పట్ల ఆమె తండ్రి కట్టా లక్ష్మణ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి ఆమెకు క్రికెట్ అంటే మక్కువ అని.. ఆమె ఆసక్తిని గమనించి హైదరాబాద్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో జాయిన్‌ చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకుని తన ప్రతిభను నిరూపించుకుందని ఆనందం వ్యక్తం చేశారు. లక్ష్మణ్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, శ్రీవల్లి తల్లి ఉమారాణి గృహిణి.


జాతీయ స్థాయి సీనియర్ మహిళల విభాగంలో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి హైదరాబాద్ జుట్టుకు ఎంపికైన మొదటి మహిళా క్రికెటర్‌గా కట్ట శ్రీవల్లి రికార్డు సృష్టించింది. శ్రీవల్లి ఎంపికవటంతో.. అటు క్రికెట్ అభిమానులే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవల్లి మెరుగైన ఆటతీరుతో.. కరీంనగర్ జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలబెడుతుందని ఆకాంక్షిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa