ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంట్లో నలక పడిందని ఆస్పత్రికి వెళ్తే.. ఆరేళ్ల చిన్నారి ప్రాణమే తీశారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 23, 2024, 07:35 PM

కంట్లో నలుసు పడిందని ఆసుపత్రికి తీసుకెళ్తే.. ఆరేళ్ల చిన్నారి ప్రాణమే పోయింది. కూతురి కంట్లో నలకపడి బాధపడుతూంటే చూసి విలవిల్లాడిపోయిన ఆ తల్లిదండ్రులకు.. తీరని గుండెకోత మిగిల్చారు. ఈ దారుణమైన విషాదకర ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా యుగ్గంపల్లికి చెందిన రవి, మౌనిక దంపతులు.. పటాన్ చెరువు సమీపంలోని బీరంగూడలో నివాసం ఉంటున్నారు. రవి స్థానికంగా ఓ బోర్‌వెల్ ఏజెన్సీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే.. రవి, మౌనిక దంపతులకు అన్విక అనే ఆరేళ్ల పాప ఉంది.


రోజూలాగే అన్విక ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు ఓ కర్రముక్క కంట్లో గుచ్చుకుంది. ఆ చిన్నారి సున్నితమైన కంటికి గాయమై విలవిల్లాడుతుంటే.. తమ గుండెల్లో గునపం దిగినంత బాధను అనుభవించారు ఆ తల్లిదండ్రులు. హుటాహుటిన చందానగర్‌లోని ఆనంద్ కంటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. ఏం కాదని, చిన్న గాయమేనని చెప్పి.. కంట్లో వేసే చుక్కల మందు ఇచ్చి పంపించేశారు.


మళ్లీ కాసేపటికి తర్వాత రవికి ఫోన్ చేసిన ఆనంద్ కంటి ఆస్పత్రి సిబ్బంది.. అన్విక కంటికి అయిన గాయం తీవ్రత ఎక్కువగా ఉందని.. హబ్సిగూడలో ఉన్న తమ ఆస్పత్రి బ్రాంచ్‌కు తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో శుక్రవారం (నవంబర్ 22న) మధ్యాహ్నం హబ్సిగూడలోని ఆనంద్ కంటి ఆస్పత్రి బ్రాంచ్‌కు అన్వికను తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు చిన్న ఆపరేషన్ చేయాలని.. అంతా సర్దుకుంటుందని చెప్పారు. తమ పాపకు బాగైపోయి ఎప్పటిలాగే ఇంట్లో ఆడుకోవాలన్న ఆరాటంతో.. ఆపరేషన్‌కు ఒప్పుకున్నారు. ఆ మాటే తమ కూతురి పట్ల మరణశాసనమవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు.


ఆపరేషన్‌కు సిద్ధమైన వైద్యులకు వైద్యం పట్ల పూర్తి అవగాహన ఉందా లేదా.. ఉన్నా సరే అంచనా వేయలేకపోయారా.. అనుభవం లేనివాళ్లు ఆపరేషన్ చేశారా అన్నది తెలియదు కానీ.. అన్వికకు ముక్కు ద్వారా అనస్తీషియా ఇచ్చారు. అయితే.. డోస్ ఎక్కువగా ఇవ్వటంతో.. చిన్నారి అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. స్పృహలోకి తీసుకొచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం లేకపోయింది. అయితే.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా దాచిపెట్టిన ఆస్పత్రి సిబ్బంది.. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చిన్నారిని పేరెంట్స్‌కు చెప్పకుండానే.. ఎల్బీనగర్‌లోని రెయిన్ బో ఆస్పత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న వెంటనే చిన్నారిని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే కార్డియాక్ అరెస్టుతో అన్విక చనిపోయినట్లు నిర్ధారించారు.


అన్వికను రెయిన్ బో ఆస్పత్రికి తరలించిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. ఆనంద్ కంటి ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. తమకు తెలియకుండా తమ పాపను వేరే ఆస్పత్రికి ఎలా తరలిస్తారంటూ ప్రశ్నించారు. దీంతో.. 10 గంటల ప్రాంతంలో రెయిన్‌ బో ఆస్పత్రికి వెళ్లి అక్కడ వైద్యులను ఆరా తీయగా.. అక్కడికి తీసుకొచ్చేలోపే అన్విక మృతి చెందిందని తెలపటంతో.. చిన్నారి తల్లిదండ్రులు హతాశులయ్యారు. ఈ విషాదకర విషయం తెలిసి.. చిన్నారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. మోతాదుకు మించి ఇచ్చిన మత్తుమందు వల్లే తమ కుమార్తె చనిపోయిందని అన్విక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa