ఇటీవల హైదరాబాద్ నగరంలో పలు హోటల్స్, రెస్టారెంట్లు, ప్రైవేట్ హాస్టల్స్పై ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు నిర్వహించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అపరిశుభ్రమైన కిచెన్స్, పాడైపోయిన వస్తువులతో వంటకాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మాంసాన్ని చాలా రోజులు నిల్వ చేసి వేడి వేడి వంటకాలు తయారు చేసి వడ్డిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. బేగంపేట ఏరియాలోని బాలయ్య చికెన్ సెంటర్లో అయితే దాదాపు 7 వేల కిలోల పాడైపోయిన మాంసాన్ని సీజ్ చేశారు. ఆ మాంసాన్ని నగరంలోని పలు బార్లు, కల్లు డిపోలు, వైన్ షాప్ పర్మిట్ రూమ్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
తాజాగా.. హైదరాబాద్ ఇసామియాబజార్, న్యూమోతీనగర్లో శుక్రవారం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో కలిసి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీసీ చికెన్ మార్కెట్లో దుర్గంధం, అపరిశుభ్రత పరిరసరాలను గుర్తించారు. ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. చికెన్ సెంటర్లో దారుణ పరిస్థితులతో పాటు.. ఎలుకలు వంటి వాటిని గమనించారు. వాటిని చూసిన మేయర్ ఇటువంటి చికెన్ మనం తింటున్నామా..? అని అసహనం వ్యక్తం చేశారు.
చికెన్ మార్కెట్ నిర్వాహకులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏపీసీ చికెన్ మార్కెట్ను సీజ్ చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవి కిరణ్ను ఆదేశించారు. కలుషిత, అపరిశుభ్రమైన, నాణ్యతలేని మాంసాహార విక్రయాలు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించేదిలేదని గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి నిత్యం తనిఖీలు ఉంటాయని ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా సహించేది లేదని చెప్పారు.
భారీగా తగ్గిన చికెన్ ధరలు..
ఇదిలా ఉండగా.. చికెన్ ధరలు భారీగా తగ్గాయి. కార్తీక మాసంలో చాలా మంది హిందువులు నాన్వెజ్ వంటకాలకు దూరంగా ఉంటారు. దీంతో పాటు అయ్యప్పస్వామి మాలలు ధరించిన కుటుంబాలు కూడా మాంసాహారాన్ని పూర్తిగా మానేస్తాయి. ఈ ప్రభావం చికెన్ ధరలపై పడింది. కొద్ది రోజుల క్రితం వరకు ఆకాశానికి ఎగబాకిన చికెన్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. నిన్నమొన్నటి వరకు కేజీ చికెన్ రూ.270 నుంచి రూ.300 మధ్య ఉండగా.. ప్రస్తుతం రూ. 200కు పడిపోయింది. లైవ్ చికెన్ అయితే రూ.130కే దొరుకుతుంది. అయితే పరిశుభ్రమైన వాతావరణంలో విక్రయించే చికెన్ను మాత్రమే కొనుగోలు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa