ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవిత 5 నెలల పాటు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె బెయిల్పై విడుదల కాగా.. జైలు నుంచి వచ్చాక కొన్ని నెలలుపాటు యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు. కేవలం ఇంటికే పరిమితం అయిన ఆమె.. ఎటువంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయలేదు. అయితే తాజాగా.. ఆమె మళ్లీ రాజకీయాల్లోకి మాస్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరికొన్ని రోజుల్లో కవిత క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు వెళ్లే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సమగ్ర ఇంటింటి సర్వే జరగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సర్వేపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణ జాగృతి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కులగణనను పకడ్బందీగా నిర్వహించాలని.. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదని అన్నారు. బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
జిల్లాల వారీగా పూర్తి వివరాలతో బీసీల లెక్కలతో తెలంగాణ జాగృతి సమగ్ర నివేదికను రూపొందించిందని చెప్పారు. తర్వలోనే.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్కు ఆ నివేదికను అందిస్తామన్నారు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇదే తరహాలో తెలంగాణ జాగృతి తరపున నివేదిక సమర్పించిన విషయాన్ని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. సమాజంలో అంతరాలను రూపుమాపడానికి, బలహీనవర్గాలను అన్ని రంగాల్లో మరింత పైకి తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.
'స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి బీసీ కమిషన్కు త్వరలో సమగ్ర నివేదిక సమర్పించనుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సరైన కుల సర్వే నిర్వహించి అణగారిన వర్గాల అవసరాలను తీర్చడం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. సామాజిక న్యాయం దేశ సామాజిక స్వరూపాన్ని బలోపేతం చేస్తుంది. జై తెలంగాణ' అని కవిత ట్వీట్ చేశారు.
కాగా, డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కవిత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. అప్పటివరకు సోషల్ మీడియా, మీడియా వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించాలని.. అందుకోసం క్షేత్రస్థాయిలో కేడర్తో సమావేశాలు నిర్వహించేందుకు ఆమె సిద్ధమైనట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa