ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందే.. ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 27, 2024, 11:02 PM

తెలంగాణ ప్రభుత్వం మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును ప్రారంభించించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మూసీ రివర్ బెడ్, బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలకు అధికారులు నోటీసులు ఇవ్వటంతో పాటు కొన్నింటిన కూల్చేశారు. దీనిపై వారు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అమలుకు ఇళ్లను ఖాళీ చేయించడాన్ని, కూల్చివేతలను సవాలు చేస్తూ 46 పిటిషన్ల దాఖలు కాగా.. మంగళవారం జస్టిస్‌ సి.వి.భాస్కర్‌ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం అన్నింటినీ ఒకేసారి విచారణ చేపట్టి కీలక తీర్పు వెలువరించింది.


మూసీ రివర్ బెడ్ బఫర్‌ జోన్, ఎఫ్‌టీఎల్‌లలో అనధికారికంగా ఉన్న నివాసాలను తక్షణమే ఖాళీ చేయించాలని తీర్పునిచ్చింది. మూసీలోకి మురుగు, కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుతో ప్రభావితం అవుతున్న వారిని సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వేతో గుర్తించాలని చెప్పింది. ప్రభుత్వ విధానాల ప్రకారం ఆయా బాధితులకు సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని చెప్పింది. దాంతో పాటుగా తగిన పరిహారం చెల్లించడం ద్వారా భూములను సేకరించాలని మార్గదర్శకాలు జారీ చేసింది.


మూసీ రివర్‌ బెడ్, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలో ఉన్న తాత్కాలిక, అనధికారిక నిర్మాణాలను నిర్దిష్ట గడువులోగా తొలగించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. అధికారులు 2012-బిల్డింగ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. మూసీ నదిలోకి మురికినీరు రాకుండా చర్యలు తీసుకోవాలని.. ఆక్రమణదారుల నిర్మాణాలను తొలగించేప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. ఆక్రమణదారులకు నోటీసులిచ్చాకే చర్యలు చేపట్టాలని తీర్పులో వెల్లడించింది.మూసీ పునరుద్ధరణతో ప్రభావితులయ్యే వ్యక్తులకు సంబంధించి సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించాలని.. పేదలకు వివిధ ప్రభుత్వ పథకాల కింద అనువైన ప్రాంతంలో వసతి కల్పించాలని సూచించింది.


ఒకవేళ పట్టా, శిఖం భూములుంటే సంబంధీకులకు అధికారికంగా సమాచారం ఇచ్చి.. చట్ట ప్రకారం తగిన పరిహారం చెల్లించి ఆయా భూములను సేకరించాలని తీర్పులో వెల్లడించింది. మూసీ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లను గుర్తించడానికి నిర్వహించే సర్వేకు పిటిషనర్లు, ఆక్రమణదారులు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా సంయమనం పాటించాలని సూచించింది. హైకోర్టు ఉత్తర్వుల అమలు కోసం ఇరిగేషన్, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్‌ శాఖల అధికారులకు పూర్తి స్థాయిలో పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించింది. ఇక నుంచి నదులు, సరస్సులను, చెరువుల, నీటి వనరులు ఆక్రమించుకున్న కబ్జాదారులపై తెలంగాణ ఇరిగేషన్, వాల్టా చట్టాల కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని తీర్పులో వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa