ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లంచం తీసుకుంటూ దొరికిపోయిన అధికారి.. కట్ చేస్తే, బయటపడ్డ రూ.100 కోట్ల ఆస్తులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 07:11 PM

ప్రభుత్వ శాఖలో మంచి ఉద్యోగం.. ఆరంకెల జీతం.. ఉన్నతస్థాయి అధికారిగా గుర్తింపు.. విలాసవంతమైన జీవితం.. సమాజంలో మంచి గౌరవం.. అయినా ఆయన ఆశ తీరలేదు. ఇంకా సంపాధించాలని ఆయన బుద్ది పక్కదారి పట్టింది. ఇంకేముందు.. టేబుల్ కింద చేయిపెట్టటం మొదలుపెట్టాడు. ఎప్పటి నుంచి ఈ పనికి అలవాడు పడ్డాడో కానీ.. ఎంత పెద్దస్థాయి వ్యక్తి అయినా తప్పు చేస్తే ఏదో ఓ రోజు దొరికిపోవాల్సిందే అన్నట్టుగా.. ఇటీవలే ఓ బాధితుని దగ్గరి నుంచి లక్ష రూపాయాలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో.. ఆ అధికారి అసలు సంగతేంటని.. సోదాలు నిర్వహించగా కళ్లుబైర్లు కమ్మేలా అక్రమాస్తుల చిట్టా బయటపడింది. ఏకంగా. రూ.100 కోట్లకు మించే అక్రమాస్తులు ఉన్నట్టు బయటపడింది.


తెలంగాణలోని నీటిపారుదల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న నికేశ్ కుమార్‌‌ అవినీతి చిట్టాను ఏసీబీ బయటపెడుతోంది. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ.. మే నెలలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన నికేశ్ కుమార్ జైలు పాలయ్యారు. విచారణ చేయగా.. నికేష్ కుమార్ అవినీతి వ్యవహారం అనుకున్నంత చిన్నగా లేదని పోలీసులు గుర్తించారు. నికేష్ కుమార్ మీద ఎప్పటి నుంచో ఆదాయానికి మించి ఆస్తులతో పాటు, అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తేలటంతో.. ఏసీబీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు.


శుక్రవారం (నవంబర్ 29న) ఉదయం నుంచి.. నికేష్ కుమార్‌కు సంబంధించిన ఇండ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణతో పాటు ఏపీలో మొత్తంగా 25 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా రూ.100 కోట్ల విలువైన అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. బయటపడిన ఆస్తుల్లో ఎక్కువగా.. రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నట్టుగా తేలింది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతుండగా.. అక్రమాస్తుల విలువ ఇంకా పెరగనున్నట్టు అంచనా వేస్తున్నారు.


అయితే.. మణికొండలోని నెక్నాంపూర్‌లో నిర్మాణ ప్రాజెక్టు కోసం ఎన్‌ఓసీ ప్రాసెస్ చేసి, ఫార్వార్డ్ చేసేందుకు.. అసిస్టెంట్ ఇంజనీర్‌ నికేష్ కుమార్‌తో పాటు.. కె. భన్సీ లాల్ (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్), కె. కార్తీక్ (అసిస్టెంట్ ఇంజనీర్), మరియు పి. గణేష్ (సర్వేయర్)తో కలిసి బొమ్ము ఉపేంద్రనాథ్ అనే కాంట్రాక్టర్‌ నుంచి లంచం డిమాండ్ చేశారు. అందరికీ కలిపి రెండున్నర లక్షలు డిమాండ్ చేశారు. కాగా.. అప్పటికే లక్షన్నర అడ్వాన్స్‌గా చెల్లించగా.. మిగిలిన లక్ష ఇచ్చే సమయంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఇంకేముంది.. నికేష్ కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారు.. ఆదాయానికి మించి కూడబెట్టిన అక్రమాస్తులను బయటపెడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa