తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతుంటే.. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ పాలనపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని.. పాలనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ.. విమర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని.. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాంబు పేల్చారు. అందరూ.. ఎప్పుడు ఎన్నికలొచ్చిన బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్తుంటే.. దయాకర్ రావు మాత్రం త్వరలోనే ఎన్నికలు వస్తాయని.. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 29వ తేదీన దీక్షా దివస్ సందర్భంగా.. వరంగల్, జనగామలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
వరంగల్లో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధ్యక్షతన జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు.. జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయని.. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పుకొచ్చారు. వెయ్యి మంది బిడ్డలు వీరమరణం పొందిన తర్వాతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని తెలిపారు. నాడు సోనియా గాంధీని బలి దేవత అన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో తన తల్లి అంటూ పొగుడ్తున్నాడని ఎద్దేవా చేశారు.
అనంతరం జనగామలో నిర్వహించిన దీక్షా దివస్లో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి.. పాలకుర్తి అసెంబ్లీ టికెట్ మార్చాలని కేసీఆర్కు తాను ఆరోజే చెప్పానని.. కానీ ఆయన వినిపించుకోలేదన్నారు. అందుకే పాలకుర్తి ప్రజలు నన్ను మార్చేశారని తెలిపారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని జనం తనను ఓడించారని.. కానీ ఇప్పుడు బాధపడ్తున్నారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా సత్తా చాటుతామని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఇదే కార్యక్రమంలో మాట్లాడిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజాయితీ గురించి మాట్లాడుతున్న కడియం శ్రీహరి.. మొదట తన పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa