పదో తరగతి విద్యార్థుల మార్కుల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిన్న (నవంబర్ 28న) కీలక నిర్ణయం తీసుకోగా.. ఈరోజు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. పదో తరగతిలో ఇప్పటివరకు ఉన్న గ్రేడ్ల విధానానికి స్వస్తి చెప్పాలని భావిస్తూ గురువారం రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఆ నిర్ణయాన్ని సర్కార్ శుక్రవారం (నవంబర్ 29న) రోజున వెనక్కి తీసుకుని అందరికీ ట్విస్ట్ ఇచ్చింది. పదోతరగతిలో ఇంటర్నల్ పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2024-25 విద్యా సంవత్సరానికి నిలిపివేస్తూ.. వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే.. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి.. ఇప్పటి వరకు ఉన్న గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి సర్కార్.. గురువారం (నవంబర్ 28న) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు.. ఒక్కో సబ్జెక్టుకు మొత్తం 100 మార్కులకు గానూ.. వార్షిక పరీక్షలకు 80 మార్కులు కేటాయించగా.. ఇంటర్నల్ పరీక్షలకు 20 మార్కులుగా కేటాయించార. కాగా.. ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచే ఇంటర్నల్ పరీక్షలకు మార్కుల విధానాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక నుంచి 6 సబ్జెక్టుల పరీక్షలకు 600 మార్కులు ఉంటాయంటూ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ వెంటనే పాఠశాల విద్యాశాఖకు కూడా ఆదేశాలు జారీ చేసింది. వచ్చే మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నుంచే ఈ మార్పులు అమలులోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
కాగా.. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఇలాంటి కీలక నిర్ణయాలను విద్యా సంవత్సరం మొదట్లోనే ప్రకటిస్తే.. అందుకు అనుగుణంగా విద్యార్థులు అన్ని రకాలుగా సిద్ధమవుతారని.. కానీ పరీక్షలకు కేవలం 4 నెలల ఉందనగా వెల్లడించటం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని అన్ని వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది.
అయితే.. ఈ కొత్త విధానంపై పాఠశాల విద్యాశాఖ నుంచి ఆగస్టు 19వ తేదీన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. ఏకంగా 3 నెలల 10 రోజులకు దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 80 మార్కులకు సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ-1) పరీక్షలు పూర్తికావటంతో.. ఇప్పుడు ఈ విధానాన్ని ప్రకటించటం ఎంత మాత్రం సరైన నిర్ణయం కాదని.. విద్యారంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. వారి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. గురువారం రోజున ప్రకటించిన తన నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అయితే.. ఈ కొత్త విధానాన్ని వచ్చే ఏడాది అంటే.. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa