ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15 వేలు.. అప్పటి నుంచే.. రైతులకు పండగలాంటి వార్త చెప్పిన సీఎం రేవంత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2024, 07:10 PM

తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అన్నాదాతల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు వేసేదెప్పుడో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. రైతు రుణమాఫీ, రైతు భరోసా డబ్బులపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తోందని.. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.


రైతు భరోసా పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని.. కమిటీ ఇచ్చిన నివేదికను శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి చర్చిస్తామని సీఎం వెల్లడించారు. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసాను ఎవ్వరూ ఆపలేరన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రూపంలో మారీచులు వస్తారని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.


మరోవైపు.. మహబూబ్‌నగర్‎లో జరిగిన రైతు పండగ వేడుక విజయవంతమైందని తెలిపిన రేవంత్ రెడ్డి.. అన్నదాతల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మరో తొమ్మిదేళ్లు కొనసాగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‎పై ప్రజలకు ఏ మాత్రం ప్రేమ తగ్గలేదన్న విషయం.. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రైతు పండగ వేడుకతో స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నామని.. ఏడాది పరిపాలనపై సంతృప్తిగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు.


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‎తో ఉందని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాళ్లు చేసిన అప్పు వల్ల.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రతి నెల రూ.6500 కోట్ల వడ్డీ కడుతోందని వెల్లడించారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఆగమ్యగోచరంగా ఉన్నా.. ఏమాత్రం అధైర్య పడకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతులకు అన్నిరకాలుగా మేలు చేస్తున్నామని తెలిపారు.


అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ఎగ్గొట్టిన వానాకాలం రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు.. రూ.7625 కోట్లు విడుదల చేసినట్టు క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. 22 రోజుల్లో మూడు విడతల్లో రూ.17,869 కోట్లతో 22.22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు.. ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేసిన దాఖలాలు ఎక్కడా లేవని సీఎం చెప్పుకొచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa