ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కమ్యూనిస్ట్ నాయకుల నుంచి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మావోయిస్టుల పేరుతో అమాయకులను పొట్టనబెట్టుకున్నారంటూ కీలక ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ములుగు ఎన్ కౌంటర్పై ఆ జిల్లా ఎస్పీ శబరీష్ క్లారిటీ ఇచ్చారు.
వాజేడులో ఇద్దరు అమాయకులను మావోయిస్టులు చంపారని ఎస్పీ శబరీష్ తెలిపారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు.. జిల్లా వ్యాప్తంగా పెట్రోలింగ్ పెంచామని చెప్పుకొచ్చారు. ఆదివారం (డిసెంబర్ 1న) ఉదయం 6 గంటలకు పెట్రోలింగ్ టీమ్కు 10 నుంచి 15 మంది మావోయిస్టులు కనిపించారు. పోలీసులను చూసిన వెంటనే మావోయిస్టులు కాల్పులు జరపటం మొదలుపెట్టారు. అప్పటికీ ఎదురు కాల్పులు జరపకుండా.. లొంగిపోవాలంటూ పలుసార్లు హెచ్చరించామని.. అయినప్పటికీ వాళ్లు మాత్రం కాల్పులు ఆపలేదని ఎస్పీ తెలిపారు. దీంతో.. చేసేదేమీ లేక ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. కాల్పుల అనంతరం సెర్చ్ చేయగా ఏడుగురు చనిపోయినట్లు గుర్తించామన్నారు. మరో ఎనిమిది మంది మావోయిస్టులు పారిపోయినట్టు తెలుస్తోందన్నారు. మావోయిస్టులు అడవులను వదిలి.. జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు.
ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు మరణించినట్టు తెలుస్తోంది. ఇల్లందు, నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి భద్రు అలియాస్ పాపన్నతో పాటు అతని దళ సభ్యులు మరణించినట్లు సమాచారం. మృతుల్లో కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న(35), ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22), ముస్సకి జమున (23), మల్లయ్య అలియాస్ మధు (43), జైసింగ్ (25), కామేశ్ (23), కిశోర్ (22) ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఈ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ములుగు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కొందరు మావోయిస్టులు పారిపోయారన్న అనుమానంతో అడవులు, పరిసర గ్రామాలను జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఏజెన్సీ ఏరియాలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa