ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం మత్తులో హిట్ అండ్ రన్.. స్పాట్‌లోనే దంపతులు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2024, 10:27 PM

మద్యం సేవించి వాహనాలు నడపటం నేరమని చెబుతున్నా.. కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారు. తప్పతాగి ప్రమాదాలకు కారణమై.. అమాయకులను బలి తీసుకుంటున్నారు. తాజాగా.. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిపై ఇవాళ ఉదయం యాక్సిడెంట్ జరిగింది. బైక్‌పై వెళ్తున్న దంపతులతో పాటుగా ఆటోలో వెళ్తున్న నలుగుర్ని అతి వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది.


 ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులు హైదరాబాద్ నంది నగర్ ప్రాంతానికి చెందిన దినేష్ గోస్వామి(35), మోనా ఠాకూర్‌ (34)గా గుర్తించారు. మోనా గర్భవతి అని తెలిసింది. కాగా, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గర్భవతి అయిన మోనాతో పాటు భర్త మృతితో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. అయితే యాక్సిడెంట్‌కు కారణం మద్యం మత్తే అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కారు డ్రైవర్ వికారాబాద్ జిల్లా మోద్కురుకు చెందిన ప్రణయ్‌గా గుర్తించారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


హైదరాబాద్ చర్లపల్లిలోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ప్రమాదవశాత్తు కారు ఢీకొని ఆధ్య (9) ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెలితే.. ఘట్కేసర్ మండలం మేడిపల్లికి చెందిన బంటు రమేష్ స్థానికంగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం చర్లపల్లిలోని బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకలకు భార్య, కూతురు ఆధ్యతో కలిసి అటెండ్ అయ్యాడు. చిన్నారి ఆద్య ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. వేడుకలకు వచ్చిన ఓ బంధువు కారు రివర్స్ చేస్తుండగా చిన్నారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారికి గాయాలయ్యాయి. చిన్నారి ఆద్యను వెంటనే ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa