ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాళేశ్వరం ఆలయంతో ఫడ్నవీస్‌కు ప్రత్యేక అనుబంధం.. అప్పట్లో రూ.17 కోట్లు ప్రకటించిన మహారాష్ట్ర సీఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 07:10 PM

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. అయితే, తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతంతో ఫడ్నవీస్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. అంతేకాదు, ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన పలుసార్లు చెప్పారు. ఈ క్షేత్రాన్ని మహారాష్ట్ర సీఎం చాలాసార్లు దర్శించుకుని స్వామికి పూజలు నిర్వహించారు. 2005కు ముందు నాగ్‌పూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తొలిసారి కాళేశ్వరం ఆలయానికి వచ్చారు.


ముందు రోజు రాత్రి సిరోంచలో బస చేసి ఉదయం పడవలో గోదావరి నదిని దాటి గుడికి చేరుకున్నారు. అనంతరం 2016లో గోదావరి ప్రాణహిత అంతర్రాష్ట్ర వంతెన ప్రారంభోత్సవ సందర్భంగా సిరొంచలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. బ్రిడ్జి లేని సమయంలో తాను పడవ దాటి కాళేశ్వరుడిని దర్శించుకున్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) ఆయనను ఆహ్వానించగా..ఫడ్నవీస్ హాజరయ్యారు.


ఈ కార్యక్రమం అనంతరం కాళేశ్వర-ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే, ఏప్రిల్ 2022లో సరిహద్దున సిరొంచలో ప్రాణహిత పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తీశ్వరుని ఆశీస్సులు తీసుకున్నారు. అంతేకాదు, కాళేశ్వర క్షేత్రం అభివృద్ధిలోనూ మహారాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉండాలని ఆయన భావించారు. అందుకే, 2014 నుంచి 2019 మధ్య సీఎంగా ఉన్నప్పుడు నిధులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. 2017లో క్షేత్రం అభివృద్ధికి తమ రాష్ట్రం తరఫున రూ.17 కోట్లు ఆయన ప్రకటించారు. కానీ, అధికారులు, నాయకులు శ్రద్ధ పెట్టకపోవడంతో ఆ నిధులు మంజూరు కాలేదు.


ఇక, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య జరిగిన ఒప్పందంలో దేవేంద్ర ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించారు. ఇరు రాష్ట్రాల అధికారులు సర్వే చేసి 374 హెక్టార్ల మేర ముంపునకు గురవుతున్నట్టు గుర్తించగా.. ఆ రాస్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ముంపు రైతులకు పరిహారాన్ని అందించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa