ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్- హైదరాబాద్ ఫ్లైట్‌లో ప్రయాణికుడు న్యూసెన్స్.. ఎయిర్‌హోస్టెస్‌తో అనుచిత ప్రవర్తన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 07:08 PM

దుబాయ్‌ నుంచి వయా బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. పిచ్చి చేష్టలకు పాల్పడి... ఎయిర్‌హోస్టెస్‌తోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విమానంలోని సిబ్బంది, తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. బెంగళూరు విమానాశ్రయంలో విమానం ఆగినప్పుడు అతడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా కొద్దిసేపటికే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో చివరకు విమానం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించారు. అతడ్ని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నర్సింహులుగా గుర్తించారు.


ఎయిర్‌పోర్ట్ పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన నర్సింహులు కొన్ని నెలల క్రితం ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లాడు. అయితే, అక్కడకు వెళ్లిన తర్వాత అతడి మానసికస్థితి సరిగా లేకపోవడంతో తిరుగు పయనమయ్యాడు. బుధవారం ఉదయం దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానం ఎక్కాడు. టెకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత నర్సింహులు పిచ్చిగా ప్రవర్తిస్తూ హంగామా చేశాడు. నా కొడుక్కి బాగోలేదు... విమానాన్ని ఆపాలని ఎయిర్‌ హోస్టెస్‌కు అతడు చెప్పాడు. దాంతో క్యాబిన్ సిబ్బంది.. మీ కుమారుడు ఎక్కడున్నాడు.? విమానాన్ని ఎక్కడ ఆపాలి? అని నర్సింహులుని అడిగారు. కానీ, అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎయిర్‌హోస్టెస్‌ పైలట్‌కు సమాచారం ఇచ్చారు.


అతడి ప్రవర్తనను భరించలేక తోటి ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది విసుగుచెందారు. విమానం బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పించినా ఏమాత్రం మార్పు రాలేదు. మళ్లీ బెంగళూరు నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తుండగా న్యూసెన్స్‌ మొదలుపెట్టాడు. అతడి తీరుపై తోటి ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అర్ధరాత్రి 11.50 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు విమానం చేరుకుంది. విమాన సిబ్బంది ఫిర్యాదు చేయడంతో నర్సింహులును ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూసెన్స్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, తన భర్తకు మతిస్థిమితం సరిగాలేదని అతడి భార్య చెప్పినట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల కోసం అతడ్ని ఆసుపత్రికి తరలించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa