ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగం కూడా కేంద్రం చేతికే.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 31, 2024, 06:02 PM

తెలంగాణకు గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంది. ఇటీవలే.. ఆర్ఆర్ఆర్‌ ప్రాజెక్టులోని ఉత్తర భాగానికి సంబంధించిన నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానిస్తూ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా.. రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రీజినల్ రింగు రోడ్డు దక్షిణ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మించాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంట్రెస్టింగ్ లేఖ రాసింది.


దక్షిణ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మించాలని.. రహదారి కోసం సేకరించే భూములకు చెల్లించే పరిహారంలో 50 శాతం వాటాను తామే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో వెల్లడించింది. ఉత్తర భాగంతో సమాంతరంగా దక్షిణభాగం పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని.. ఒకవేళ అలా సాధ్యంకాని పక్షంలో ఉత్తరభాగం పూర్తయిన వెంటనే దక్షిణ భాగం పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్రానికి రేవంత్ రెడ్డి సర్కార్ లేఖ రాసింది.


తెలంగాణకు రీజినల్ రింగు రోడ్డును మంజూరు చేసినప్పుడే.. ఉత్తర, దక్షిణభాగాలను తామే నిర్మిస్తామని కేంద్రం తెలిపింది. కానీ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. దక్షిణ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించటమే కాకుండా.. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టింది. మళ్లీ ఇప్పుడు ఏమైందో కానీ.. మనసు మార్చుకుని కేంద్రానికి లేఖ రాయడం సర్వత్రా చర్చనీయాశంగా మారంది.


"రోజురోజుకూ రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ రంగం, ఫార్మా పరిశ్రమలు, లాజిస్టిక్‌ పార్కులతో ట్రాఫిక్‌ విపరీతంగా పెరుగుతోంది. 15 ఏళ్ల క్రితం నిర్మించిన ఔటర్‌ రింగు రోడ్డుపైన వాహన రద్దీ పెరుగుతోంది. రాబోయే ఐదేళ్లలో ఈ రద్దీ మరింత పెరుగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో భాగంగా కేవలం ఉత్తరభాగాన్ని మాత్రమే నిర్మిస్తే ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించలేం. ఈ రోడ్డుకు సమాంతరంగా దక్షిణ భాగాన్ని కూడా నిర్మించాలని నిర్ణయించాం. కానీ రెండు భాగాలూ ఒకేసారి నిర్మిస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే దక్షిణ భాగంవైపు భూముల ధరలు, నిర్మాణ వ్యయం అధికమయ్యే అవకాశం ఉంది.


ఈ నేపథ్యంలో దక్షిణభాగం రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేసి, భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వండి. దక్షిణభాగం భూసేకరణకు అయ్యే వ్యయంలో రాష్ట్ర వాటా కింద 50 శాతం వాటాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రెండు భాగాలనూ ఒకేసారి నిర్మించేందుకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులుంటే.. ఉత్తరభాగం నిర్మాణం పూర్తయిన తరువాత రెండో విడత కిందైనా దక్షిణభాగం రహదారి పనులను ప్రారంభించండి." అని లేఖలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూసేకరణ 95 శాతం పూర్తయిందని, పరిహారం చెల్లించేందుకు ఆర్థిక అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.


తెలంగాణకు రీజినల్‌ రింగు రోడ్డును 2016లో కేంద్రం మంజూరు చేసింది. అనంతరం 2017లో దానిని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించింది. ఉత్తర భాగం నర్సాపూర్‌ నుంచి తూప్రాన్‌- గజ్వేల్‌- జగదేవ్‌పూర్‌- భువనగిరి- చౌటుప్పల్‌ వరకూ 161.2 కిలోమీటర్లు ఉండగా, దక్షిణ భాగం చౌటుప్పల్‌ వద్ద ప్రారంభమై ఆమనగల్‌- షాద్‌నగర్‌ మీదుగా సంగారెడ్డి వరకు 189 కిలోమీటర్ల మేర ఉంటుందని తెలిపింది. వీటిలో మొదటగా ఉత్తరభాగం నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. భూ సేకరణ, అటవీ అనుమతులు, సహా వివిధ అంశాలతో దాదాపు ఆరేళ్లుగా రహదారి పనుల్లో జాప్యం జరగ్గా.. తాజాగా డిసెంబరు 27న జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రహదారి నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించడంతో కీలక అడుగుపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa