ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టులో 'పుష్ప 2' నిర్మాతలకు భారీ ఊరట

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 02, 2025, 12:21 PM

పుష్ప-2 సినిమా బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటపై చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన కేసులో మైత్రి మూవీస్‌ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యర్నేని నవీన్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది.తదుపరి ఆదేశాలిచ్చే వరకు వారిని అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.'మైత్రి మూవీ మేకర్స్‌ పేరుతో సినిమా నిర్మాణ, పంపిణీ సంస్థను నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 30కి పైగా సినిమాలను నిర్మించాం. అలాగే 'పుష్ప 2'తో సహా 30 ఇతర సినిమాలను పంపిణీ చేశాం. సంధ్య థియేటర్‌ వద్ద డిసెంబర్‌ 4న జరిగిన తొక్కిసలాట కారణంగా ఊపిరాడక తన భార్య, కుమారుడు కుప్పకూలారని చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో భాస్కర్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మహిళ మృతిచెందగా, బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలైనంత మాత్రాన ఘటనకు బాధ్యులను చేస్తూ క్రిమినల్‌ కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధం. మాపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలి'అని రవిశంకర్, నవీన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.సుజన విచారణ చేపట్టారు. పిటిషనర్ల పాత్ర సినిమా నిర్మాణానికి మాత్రమే పరిమితమని వారి తరఫు న్యాయ వాది వాదించారు. ఒక్కసారి బయ్యర్లకు విక్రయించిన తర్వాత వారి పాత్ర ఏమీ ఉండదని చెప్పారు. ఎటువంటి సంబంధంలేని నిర్మాతలపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడం సరికాదని, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లను అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa