ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదాద్రి భక్తులకు శుభవార్త.. వారందరికీ స్పెషల్ దర్శనం.. ఆ సమయాల్లోనే..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 03, 2025, 06:54 PM

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం.. భక్తులతో కిటకిటలాడుతోంది. పునర్నిర్మాణం తర్వాత.. తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదగిరిగుట్టకు రోజురోజు భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. ప్రత్యేక రోజుల్లో అయితే.. భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆదివారంతో పాటు మిగితా సెలవు దినాల్లో 60 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.


అయితే.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో.. స్వామివారిని దర్శించుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులకు క్యూలైన్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయం దేవస్థాన అధికారుల దృష్టికి రావటంతో.. ఆ సమస్య పరిష్కారంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా.. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు తరలివస్తున్న వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులకు స్పెషల్ దర్శనం కల్పించేందుకు పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.


కొండపై ఉన్న ప్రధాన ఆలయ తూర్పు ద్వారం ముందు ఏడడుగుల గేట్‌తో కూడిన గ్రిల్స్‌ ఏర్పాటు చేశారు. తూర్పు ద్వారం ముందు దివ్యాంగులు, వృద్ధులు, చంటి పిల్లల తల్లులు కూర్చోవడానికి బెంచీలు, కుర్చీలను ఏర్పాటు చేశారు. వీరికి ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 5.30 గంటల సమయంలో స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఆలయ సిబ్బందే స్వయంగా.. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లులను ప్రత్యేక క్యూ లైన్‌లో తీసుకెళ్లి స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పిస్తామని ఈవో భాస్కర్‌రావు తెలిపారు. దీంతో.. వారందరికీ క్యూలైన్లలో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ఉపశమనం దొరకనుంది.


అయితే.. యాదాద్రిలో ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం పలు సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చిన దేవస్థాన పాలకమండలి.. గతంలో ఉన్న సేవలను కూడా పునఃప్రారంభిస్తూ వస్తోంది. కొండపైనే గుండాన్ని ప్రారంభించటమే కాకుండా.. భక్తులు నిద్ర చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తూ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఇక త్వరలో తిరమల తిరుపతి దేవస్థానం తరహాలో పూర్తి స్థాయిలో యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa