ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవి అబద్ధమైతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా.. కవిత సంచలన ఛాలెంజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 03, 2025, 07:03 PM

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. సంచలన ఛాలెంజ్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అడుగడుగునా బీసీలకు అన్యాయం చేశాయని ఆరోపించిన కవిత.. ఈ రెండు జాతీయ పార్టీలు బీసీలకు చేసిన ద్రోహంపై తాను చెప్పిన విషయాల్లో ఏ ఒక్కటి అవాస్తవం అని తేల్చినా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కవిత ఛాలెంజ్ చేశారు. దేశంలో బీసీలకు ఎవరైనా న్యాయం చేశారంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమేనని కవిత స్పష్టం చేశారు.


హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో నిర్వహించిన బీసీ మహాసభలో పాల్గొన్న కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే జనాభా గణనలో కులగణన చేయాలని బీజేపీని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేసిన కవిత.. కర్ణాటక, బిహార్, మహారాష్ట్ర ఫెయిల్యూర్ స్టోరీ తెలియకుండానే హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీల లెక్కలపై ఒక కమిషన్ వేస్తే మరో కమిషన్ రిపోర్టు ఇస్తుందని.. ఇది న్యాయస్థానాల్లో నిలుస్తుందా అని అడిగారు. ఈ కుట్రపై కాంగ్రెస్ జవాబు చెప్పాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు.


జవహార్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్టును ఆయనే తిరస్కరించడమనేది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా అని కవిత ప్రశ్నించారు. 1955లో నెహ్రూ ఆ నివేదికను తిరస్కరిస్తే ఆ తర్వాత 25 ఏళ్లు ఎవరూ బీసీల గురించి పట్టించుకోలేదని గుర్తు చేశారు. పదేళ్లు బీసీలు గుర్తుకురాలేదా అని తమను ప్రశ్నించేవారికి కాంగ్రెస్ చరిత్ర అంతా చెప్తామన్నారు. నెహ్రూ, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు పూర్తిగా అన్యాయం చేశారని మండిపడ్డారు. సోనియమ్మ రాజ్యంలో 2011లో రూ. 4500 కోట్లు వెచ్చించి కులగణన చేసి.. ఇప్పటివరకు ఆ నివేదిక బయటపెట్టలేదని దుయ్యబట్టారు. బీజేపీ కూడా ఆ రిపోర్టును బయటపెట్టకపోగా.. కులగణనకు వ్యతిరేకం అని బహిరంగంగానే చెబుతుందని కవిత నిప్పులు చెరిగారు.


మరోవైపు.. సావిత్రిబాయి ఫూలే జన్మదినం దేశంలో ఉన్న మహిళలందరికీ పండగ రోజు కవిత చెప్పుకొచ్చారు. ప్రస్తుత సమాజంలో మహిళలంతా చదువుకుంటున్నారంటే.. అది ఆమె కృషేనని కొనియాడారు. చాలామంది దేశంలో కులం లేదని చెబుతున్నారని.. కానీ కులం ఉంది నిజం కాబట్టే రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు కులాలకు రక్షణ కల్పించారని చెప్పుకొచ్చారు. అయితే బీసీలకు రాజ్యాంగంలో రక్షణ దొరికి ఉంటే ప్రస్తుతం.. దేశం అభివృద్ధిలో అమెరికాను దాటేదని కవిత అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa