ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌కు భారీ ఊరట

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 11, 2025, 07:31 PM

పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం.. చంచల్‌గూడ జైలుకు తరలించడం.. ఆ వెంటనే బెయిల్ లభించడంతో మరుసటి రోజు ఉదయం బయటికి వచ్చారు. అయితే ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు కొన్ని షరతులు కూడా విధించింది. ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి హాజరు కావాలని పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుత సమయంలో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు విదేశాలకు వెళ్లకూడదు అంటూ అల్లు అర్జున్‌కు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ కండీషన్లను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించకూడదని పేర్కొంది.


అయితే తాజాగా ఈ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు భారీ ఉపశమనం కల్పించింది. ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లే నిబంధనను ఎత్తివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా అల్లు అర్జున్ దాఖలు చేసుకున్న విజ్ఞప్తికి అంగీకరించిన నాంపల్లి కోర్టు.. ప్రతీ ఆదివారం పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని పేర్కొంది. అదే సమయంలో విదేశాలకు కూడా వెళ్లేందుకు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.


 ఇక ఈ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఇటీవల అల్లు అర్జున్‌ పరామర్శించారు. తెలంగాణ ఫిలిమ్ డెవలప్‌మెంట్ ఛైర్మన్, దిల్‌రాజుతో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి.. అతడికి అందిస్తున్న చికిత్స వివరాలను అల్లు అర్జున్ అడిగి తెలుసుకున్నారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో కిమ్స్ ఆస్పత్రి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.


సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన రెగ్యులర్‌ బెయిల్‌ను మంజూరు చేయగా.. ఈ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేసే వరకు 2 నెలల పాటు ప్రతీ ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోపు చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే గత ఆదివారం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన అల్లు అర్జున్ సంతకం చేసి వెళ్లారు. అప్పుడు అల్లు అర్జున్‌ను చూసేందుకు ఫ్యాన్స్‌ భారీగా ఎగబడటంతో వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నిబంధన నుంచి మినహాయింపును ఇచ్చిన నాంపల్లి కోర్టు.. కేసు విషయంలో పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది.


పుష్ప–2 ప్రీమియర్‌ షో సందర్భంగా డిసెంబర్ 5వ తేదీన రాత్రి సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ కారణం అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూ­రు చేసింది. ఆ సమయంలో రూ.50 వేలతో రెండు పూచీకత్తులు కోర్టుకు సమర్పించాలని సూచించింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ ఇప్పటికీ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే బాధిత కుటుంబానికి పుష్ప 2 చిత్ర యూనిట్‌ రూ. 2 కోట్లు ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa