రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. తిరుపతి, విశాఖ మధ్య పలు ట్రైన్లు పరుగులు పెడుతుండగా.. విశాఖకు వెళ్లే ట్రైన్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. 2024 మార్చి 12న ప్రధాని మోదీ నరేంద్రమోదీ సికింద్రాబాద్-విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ను ప్రారంభించగా.. ప్రతి రోజూ దాదాపు ఫుల్ ఆక్యుపెన్సీతో ఈ ట్రైన్ నడుస్తోంది. ఈ నేపత్యంలో ట్రైన్ల సంఖ్య లేదా కోచ్లను పెంచాలని గత కొంత కాలంగా ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తీపి కబురు చెప్పారు.
విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ ( ట్రైన్ నెంబర్ 20707/20708) ఎక్స్ప్రెస్లో కోచ్ల సంఖ్యను 8 నుంచి 16కు పెంచుతున్నట్లు SCR అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ట్రైన్లో సీట్ల సంఖ్య పెరిగింది. గతంలో 530 ఉన్న సీట్ల సంఖ్య 1,128కి పెరగనుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 13 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇందులో ఎగ్జిక్యూటివ్ కోచ్ 1, ఛైర్కార్ కోచ్లు 7 ఉన్నాయి. తాజాగా రైల్వే అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఎగ్జిక్యూటివ్ కోచ్లు 2కి, ఛైర్కార్ కోచ్లు 14కి పెరగనున్నాయి.
కాగా, సంక్రాంతి ముందు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కోచ్ల సంఖ్య పెంచటంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి పండక్కి చాలా మంది హైదరాబాద్ నుంచి విశాఖకు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రెన్లో సీట్ల సంఖ్య పెరగటం వారికి ఊరటనిచ్చే అంశమే. పండగ తర్వాత కూడా వారు ఈజీగా హైదరాబాద్ చేరుకోవటానికి వీలు కలగనుంది.
ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని రోడ్లు ప్రయాణికుల రద్దీగా మారాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు, ఏపీకి వెళ్లే వారితో కూకట్పల్లి, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ బస్టాండుల్లో రద్దీ నెలకొంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్నగర్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa