ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుంభమేళాకు వెళ్లిన తెలంగాణ భక్తులు.. బస్సులో చెలరేగిన మంటలు.. ఒకరు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 15, 2025, 07:30 PM

తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లిన ఓ బస్సు ప్రమాదానికి గురైంది. యూపీలోని బృందావనం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 50 మంది యాత్రికులు ప్రైవేట్ బస్సును అద్దెకు తీసుకుని వెళ్లారు. అయితే యూపీలోని బృందావనం వద్ద ఈ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. బృందావన్ టూరిస్ట్ సెంటర్ వద్ద బస్సును నిలిపి ఉంచిన సమయంలో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సులో ఉన్న శీలం ధ్రుపత్ అనే 63 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మృతుడిది నిజామాబాద్ జిల్లా కుబీర్ మండలం పాల్సి గ్రామంగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదం నుంచి మిగతా 49 మంది భక్తులు క్షేమంగా బయటపడ్డారు.


అయితే ప్రయాగరాజ్ కుంభమేళాలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బృందావనంలోని ఆలయాన్ని సందర్శించుకునేందుకు బస్సును అక్కడ ఆపినట్లు తెలిసింది. ఈ సమయంలోనే బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. మిగతా వారు ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ.. 63 ఏళ్ల ద్రుపత్ మాత్రం బస్సులోనే ఉండిపోయినట్లు తెలిసింది. మంటలు చెలరేగిన విషయం స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే ఫైరింజన్లు వచ్చేసరికి బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. అందులోని ద్రుపత్‌ను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక మంటలు చెలరేగడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.


మరోవైపు ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆయనతో పాటుగా ముథోల్ ఎమ్మెల్యే రామారావు బాధితుల గురించి వాకబు చేశారు. మథుర జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి భక్తుల గురించి వివరాలు తెలుసుకున్నారు. వారందరినీ క్షేమంగా స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రమాదంలో వెంట తెచ్చుకున్న సామాన్లు, దుస్తులు అన్నీ కాలిపోవటంతో కట్టుబట్టలతో ఉండాల్సిన పరిస్థితి. దీంతో స్థానిక పోలీసులు, ఆరెస్సెస్ వాలంటీర్లు వారి బాధ్యతలు చూసుకుంటున్నారు. తిరిగి తెలంగాణకు చేరుకోవడానికి కావాల్సిన సహాయం కూడా చేసినట్లు తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com