సాధారణంగా ఎన్నికల సమయంలో ఇంటింటికీ తాయిలాలు పంపటం చూస్తుంటాం. ఓటర్లను ఆకర్షించేందుకు ఇళ్ల వద్దకే వారికి కావాల్సిన నిత్యావసరాలను పంపడం మామూలే. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఇంటికీ క్యారేజీ పంపారో బీఆర్ఎస్ నేత. కనుమ పండుగ సందర్భంగా ప్రతి ఇంటికీ స్టీల్ బాక్స్ పంపించారు. ఉత్తి స్టీల్ బాక్స్ అనుకోకండి. కనుమ పండుగ సందర్భంగా ప్రతి ఇంటికీ మటన్ పంపిణీ చేశారు. స్టీల్ బాక్సులో మటన్ మాంసం ఉంచి ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామానికి బీఆర్ఎస్ యూత్ లీడర్ పడమటి అనంతరెడ్డి. గతంలోనూ కొవిడ్ వచ్చిన సమయంలో అనంతరెడ్డి ఇలాగే స్పందించారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్న సందర్భంలో.. నిత్యావసరాలను, సరుకులు ఇంటి వద్దకే పంపిణీ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా కనుమ పండుగను పురస్కరించుకుని గుంతపల్లి గ్రామంలోని ప్రతి ఇంటికీ మటన్ పంపిణీ చేశారు. గుంతపల్లి గ్రామంలో సుమారుగా 440 కుటుంబాలు ఉంటాయి. వీటిలో 400 కుటుంబాలకు పడమటి అనంతరెడ్డి మాంసం పంపిణీ చేశారు. టిఫిన్ బాక్స్లలో మాంసం ఉంచి బుధవారం ఉదయం పంపిణీ చేశారు. మిగతా కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
మరోవైపు కనుమ పండుగ కావటంతో బుధవారం ఉదయం నుంచే నాన్ వెజ్ కోసం చికెన్ సెంటర్ల వద్ద జనం భారీగా కనిపించారు. మటన్తో పాటుగా నాటుకోడి మాంసానికి భారీగా డిమాండ్ ఉంది. బాయిలర్ చికెన్ రేట్లు కూడా కేజీ 250కి పైగా పలుకుతున్నాయి. సంక్రాంతి పండుగకు బంధుమిత్రులు అందరూ ఇళ్లకు వస్తుంటారు. దీంతో మొదటి. రెండు రోజులు పిండివంటలతో వారికి మర్యాదలు చేసిన కుటుంబాలు.. కనుమ పండుగ రోజున నాన్ వెజ్ వంటకాలతో ఆతిథ్యమిస్తుంటారు. మరోవైపు కనుమ పండుగ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని మాంసం విక్రయదారులు కూడా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. డిమాండ్కు తగినట్లుగా ముందే కోళ్లు, మేకలు, గొర్రెలు సిద్ధం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa