ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా,,హైదరాబాద్ సీపీ కీలక కామెంట్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 15, 2025, 07:38 PM

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు చిన్నా పెద్ద తేడా లేకుండా, ఈలలతో గోల చేస్తూ పోటాపోటీగా పతంగులు ఎగరేస్తారు. అయితే ఈ పతంగుల ఎగురు వేసేందుకు ప్రమాదకర చైనా మాంజాను వినియోగిస్తున్నారు. చైనా మాంజా కారణంగా పక్షులతో పాటు మనుషులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు. పంతంగులను ఎగురవేసేందుకు మాంజాను విక్రయించినా, ఎగురవేసినా అరెస్టులు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది. చైనా మాంజా మనుషుల ప్రాణాలు తీస్తున్నా.. ఏమాత్రం వినిపించుకోకుండా కొందరు మాంజాను వినియోగిస్తున్నారు.


ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక కామెంట్స్ చేశారు. చైనా మాంజా స్థానికంగా తయారు చేయటం వల్లే పెద్ద మెుత్తంలో మార్కెట్‌లో లభిస్తుందని అన్నారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఆర్డర్ పెడితే ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారని చెప్పారు. చైనా మంజాను విక్రయించటం, ఉపయోగించటం ప్రమాదకరమని.. త్వరలోనే ఈ- కామర్స్ గోదాములపై సోదాలు నిర్వహిస్తామని అంటున్నారు. నిర్వహకులతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. చైనీస్ మాంజా వినియోగాన్ని అరికట్టడంలో ప్రజలంతా స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే మాంజా వినియోగం తగ్గుతుందని వ్యాఖ్యనించారు.


చైనా మాంజా దారం తగిలి బైక్‌పై వెళ్తున్న దంపతులకు గాయాలయ్యాయి. ఈ ఘటన యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దంపతులు యాదాద్రీశుడి దర్శనానికి బైక్‌పై వచ్చారు. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీసు ఎదురుగా చైనా మాంజా దారం రోడ్డు వెళ్తున్న వారికి తగలడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి గొంతు తెగింది. అతడి భార్య వాహనం పైనుంచి కింద పడడంతో తలకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.


సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఖర్ధనూరు గ్రామంలో వెంకటేష్ అనే వ్యక్తి సైతం చైనా మాంజా కారణంగా తీవ్రం గాయపడ్డాడు. బైక్‌పై వెళ్తుండగా.. అతడి మెడకు చైనా మాంజా కోసుకుపోయింది. మెడను మాంజా బలంగా తెంపడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. వెంటనే క్షతగాత్రుని పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com