ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు.. రేవంత్ సర్కార్‌కు హరీష్ కీలక సూచన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 15, 2025, 07:43 PM

తెలంగాణలోని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకునేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఇందిమ్మ ఆత్మీయ భరోసా పథకం కింది రైతు కూలీలందరికీ ఏడాదికి రూ.12 వేలు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నారు. ఈనెల 26న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ సర్కార్‌కు కీలక సూచన చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశానికి వర్చువల్‌గా హజరైన హరీష్.. ఈ పథకాన్ని షరతులతో కాకుండా.. రైతు కూలీలందరికీ అమలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.


రాష్ట్రంలో గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24,5700 మంది ఉన్నారని చెప్పారు. వారికి భూమి ఉన్నా.. రైతు కూలీలుగానే జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో కోతలు లేకుండా రైతు కూలీలందరికీ ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకంపైనా కీలక కామెంట్స్ చేశారు. నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిందని.. లబ్ధిదారుల ఎంపిక ఎవరు చేస్తారో ప్రభుత్వం చెప్పాలన్నారు. గ్రామసభలు పెట్టి లబ్ధిదారులను పారదర్శంకంగా ఎంపిక చేయాలని సూచించారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై పూర్తికాని ఇండ్లకు కూడా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలు పేదలకు మంచి చేసేలా ఉండాలని, ఆ దిశగా విధివిధానాల రూపకల్పన చేయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు ఎటువంటి తావు లేకుండా అర్హులైన వారికి పథకాన్ని అమలు చేయాలని సూచించారు. కాగా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో పాటుగా.. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రైతుబంధు పేరుతో గత ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు జమ చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 12 వేలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేస్తుండగా.. ఈనెల 26న ఈ పథకం కూడా ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com