ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫార్ములా ఈ-కారు రేస్ కేసు.. సుప్రీం కోర్టులో కేటీఆర్‌కు నిరాశ.. క్వాష్ పిటిషన్ విత్‌డ్రా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 15, 2025, 07:47 PM

హైదరాబాద్ ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసలో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. ఈ కేసును కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం కొట్టేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. కేటీఆర్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా నేడు బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది. విచారణ ప్రాథమిక దశలోనే ఉందని సుప్రీం అభిప్రాయపడింది. ప్రత్నామ్నాయ మార్గాలు మీకు ఉన్నాయి కదా అని కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ దవేని ప్రశ్నించింది. పిటిషన్‌ను డిస్మస్ చేస్తామని స్పష్టం చేసింది. దీంతో వెనక్కి తగ్గిన కేటీఆర్ తరపు న్యాయవాది తామే పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని చెప్పారు.


వాడీవేడీగా వాదనలు..


ఇక పిటిషన్ విచారణ సందర్భంగా వాడీవేడీగా వాదనలు జరిగాయి. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం కేటీఆర్‌ విపక్షంలో ఉన్నారని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఉండటంతోనే రాజకీయ కక్షలో భాగంగా కేసులు పెడుతున్నారని వాదించారు. అయితే.. ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా..? అని జస్టిస్ బేలా ఎం త్రివేది కేటీఆర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అవినీతి జరిగిందని.. అందుకు సంబంధించిన ఆధారాలు ఏసీబీ వద్ద ఉన్నాయని చెప్పారు. పూర్తి స్థాయి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఇప్పటికే కేటీఆర్ విచారణకు హాజరయ్యారని.. కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో క్వాష్ చేయటం సరైన నిర్ణయం కాదన్నారు.


ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. అయితే పిటిషన్ వెనక్కి తీసుకుని.. మళ్ళీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరఫు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని కోరారు. పిటిషన్ విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించిన సుప్రీం ధర్మాసనం.. మళ్లీ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను మాత్రం ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటామని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా,కేటీఆర్ రేపు ఈడీ విచారణను ఎదుర్కొనున్నారు. ఇప్పటికే ఆయన్ను ఏసీబీ ఓ దఫా విచారించగా.. గురవారం ఈడీ విచారణకు హాజరు కానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com