ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరుగుతున్న మహ కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తొక్కిసలాటలో ప్రాణాలు వదిలిన మృతుల కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు యోగి సర్కార్ కూడా ఆదుకోవాలని సూచించారు. ఈ విషాద సంఘటనలో గాయపడినవారిని, మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని అందిస్తుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
కాగా.. మహా కుంభమేళాలో బుధవారం (జనవరి 29) వేకువజామున పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. మౌనీ అమవాస్య సందర్భంగా.. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తజనం త్రివేణి సంగమం వద్ద భక్తులు అమృత స్నానం చేసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో.. ఘాట్ వద్ద బారికేడ్లు విరిగిపడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 20 మంది భక్తులు మరణించినట్లుగా తెలుస్తోంది. చాల మంది గాయపడగా.. క్షతగాత్రులను పారా మిలటరీ దళాలు, వాలంటీర్లు అంబులెన్స్ల్లో సమీపంలోని మహాకుంభ్ నగర్లోని సెంట్రల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు. మరోవైపు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడి ఆరా తీశారు. కేంద్రం నుంచి సాయం అందిస్తామని భరోసానిచ్చారు. అయితే.. ఫిబ్రవరి 13న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించనున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa