తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక వారికి ఇప్పటికే మధ్యాహ్న భోజనం అందిస్తుండగా.. ఇక నుంచి స్పెషల్ క్లాసులకు హాజరయ్యే స్టూడెంట్స్కు సాయంత్రం వేళ అల్పాహారం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో శనివారం నుంచే అమలు చేస్తున్నారు.
హైదరాబాద్ అబిడ్స్లోని ప్రభుత్వ అలియా మోడల్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు.. ఆ పాఠశాల ఉపాధ్యాయులు.. శనివారం స్నాక్స్ అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతిలో పాస్ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దసరా పండుగ తర్వాత నుంచే రాష్ట్రంలోని చాలా చోట్ల ఈ స్పెషల్ క్లాసులు ప్రారంభం అయ్యాయి.
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఒంటి గంటకు భోజనం చేసిన విద్యార్థులు సాయంత్రం.. స్పెషల్ క్లాసులు పూర్తి అయి ఇళ్లకు వెళ్లేసరికి రాత్రి అవుతోంది. దీంతో రాత్రి వరకు ఏమీ తినకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది ఈ నేపథ్యంలోనే వారికి సాయంత్రం పూట స్నాక్స్ అందించాలని నిర్ణయించింది. ఇక ఈ ఏడాది టెన్త్ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు పాఠశాలలు నడిచే 38 రోజులపాటు వారికి సాయంత్రం స్నాక్స్ అందించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ప్రభుత్వం మంజూరు చేయనుంది. రాష్ట్రంలోని దాదాపు 4500 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు.. మరో 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో సుమారు 1.90 లక్షల మంది పదో తరగతి చదువుతున్నారు. ఇక స్నాక్స్ కింద రోజుకో రకం వంటకాలను విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఉడకబెట్టిన పెసర్లు, పల్లీలు-బెల్లం, చిరుధాన్యాలతో చేసిన మిల్లెట్ బిస్కెట్లు, ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉల్లిపాయ పకోడి, ఉడకబెట్టిన శనగలు వంటి వాటిని రోజుకో ఒక రకం చొప్పున టెన్స్ విద్యార్థులకు అందించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa