ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు.. మంత్రి సీతక్క కీలక కామెంట్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 05, 2025, 08:20 PM

ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది పార్టీ లైన్ క్రాస్ చేసి.. కులగణన సర్వే నివేదికకు నిప్పు పెట్టడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. అలాఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మల్లన్న ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకుండా ఆయనపై వేటు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


కాగా, తీన్మార్ మల్లన్న వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. గత కొంత కాలంగా సొంత పార్టీపైనే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. హనుమకొండలో జరిగిన బీసీ రాజకీయ యుద్ధభేరీ సభలో సంచలన కామెంట్స్ చేసారు. రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి అని అన్నారు. రెడ్లపై అనుచిత కామెంట్స్ చేశారు. ఇక ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణనపైనా సంచలన కామెంట్స్ చేశారు. బీసీ కులగణన తప్పుల తడక అని.. బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం జరిగే సూచనలు లేవని.. సర్వే నివేదిక పత్రులను తగులబెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఆయనపై చర్యలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఉపక్రమించింది.


మలన్న వ్యవహార శైలిపై మంత్రి సీతక్క కీలక కామెంట్స్ చేశారు. మల్లన్న కోసం తాము చాలా కష్టపడ్డామని.. అందుకు తమకు బాధగా ఉందన్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీనా? కాదా? అనేది ఆయనే డిసైడ్ చేసుకోవాలని సూచించారు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్‌లోనే మాట్లాడాలన్నారు. కులగణన సర్వే సరిగా లేదని మల్లన్న మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. కులగణనపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికల మీద మాట్లాడాలే కానీ.. ఇలా బహిరంగంగా మాట్లాడటం, వాటిని కాల్చివేయం మంచిది కాదని హితవు పలికారు.


మల్లన్న సంగతి పార్టీనే చూసుకుంటుందన్నారు. ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేక దీనిని అడ్డుకోవాలనే కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీసీల లెక్క 56 శాతానికి పైగా తేలిందని.. ఎక్కడా ఎవరికీ కూడా నష్టం జరగలేదని సీతక్క వ్యాఖ్యనించారు. మేక వన్నె పులిలా బీఆర్ఎస్ నేతలు బీసీల హక్కులను అడ్డుకుంటున్నారని ఆమె తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa