ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీన్మార్ మల్లన్నపై కేసు ఎందుకు పెట్టలేదు..? రేవంత్ సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 06:55 PM

కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సొంత పార్టీ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గంపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు హస్తం నేతలను తీవ్ర ఆగ్రహానికి గురి చేయగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే రిపోర్టు విషయంలోనూ ఆయన తీరుపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయ్యింది. ఈ మేరకు తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు కూడా పంపించింది. పార్టీ పంపించిన షోకాజ్ నోటీసులపై కూడా తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయితే.. తీన్మార్ మల్లన్న విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేయటం గమనార్హం.


ఓ సామాజిక వర్గంపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదు వచ్చినప్పటికీ ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయలేదని రేవంత్ రెడ్డి సర్కారును హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదంటూ కే అరవింద్‌ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం (ఫిబ్రవరి 07) రోజు జస్టిస్‌ కే శరత్‌ విచారణ జరిపారు.


 ఫిబ్రవరి 2వ తేదీన వరంగల్‌లో బీసీ సంఘం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొ్న్న తీన్మార్ మల్లన్న ఓ కులాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలపై సిద్దిపేట పోలీసులతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ తీన్మార్ మల్లన్నపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం.. తీన్మార్ మల్లన్నపై ఎందుకు కేసు నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలంటూ పోలీసులను జస్టిస్‌ శరత్‌ న్యాయస్థానం ఆదేశింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.


అయితే.. ఇప్పటికే తీన్మార్ మల్లన్నపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. పార్టీలో ఉంటూనే ప్రభుత్వంపై, రాష్ట్ర నాయకత్వంపై ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తుండటంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. కులగణన సర్వే రిపోర్టును కాల్చేయటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తటంతో క్రమశిక్షణ కమిటీ చర్యలకు ఉపక్రమించి నోటీసులు పంపించింది. అయితే.. అంతకుముందే తీన్మార్ మల్లన్న పలుమార్లు ప్రభుత్వంపై వ్యతిరేక గళం వినిపించినా.. ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ఇప్పుడు సొంత పార్టీ శ్రేణుల్లో కూడా కొంత అసహనం వ్యక్తమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa