14 ఏళ్ల కొడుకుడు కన్నతండ్రే స్వయంగా కొట్టి చంపేశాడు. రక్తం పంచుకు పుట్టిన కొడుకును కన్నతండ్రే కొట్టి చంపేశాడంటే.. పెద్ద కారణమే ఉండి ఉంటుందనుకుంటే పొరపాటే. చిన్న కారణానికే ఇంత దారుణానికి పాల్పడ్డాడు ఆ మూర్ఖపు తండ్రి. ఈ ఘటన.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెంలో జరిగింది. గ్రామానికి చెందిన కట్టా సైదులు దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. తమ పిల్లలు తమలా కాకుండా ఉన్నత స్థాయిలో ఉండాలని భావించి.. కష్టపడుతూ స్థాయికి మించి ప్రైవేట్ స్కూళ్లలో మంచి చదువులు చదివిస్తున్నారు. పిల్లలు పక్కదారి పట్టకుండా క్రమశిక్షణగా పెంచుతున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది.
అయితే.. గత కొంతకాలంగా తండ్రి సైదులు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చి.. కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఇలా రోజూ జరుగుతూనే ఉంది. కాగా.. చిన్న కుమారుడు భాను (14) చౌటుప్పల్ లోని అన్న మెమోరియల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం (ఫిబ్రవరి 8) రోజున తన స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో భాను కూడా పాల్గొన్నాడు. ఫేర్వెల్ పార్టీ వల్ల కాస్త ఆలస్యం కావటంతో.. భాను ఇంటికి వెళ్లేసరికి రాత్రయ్యింది.
దీంతో.. అప్పటికే మద్యం సేవించిన ఉన్న తండ్రి సైదులు ఎందుకు ఆలస్యమైందంటూ కొడుకును ఇష్టమున్నట్టు కొట్టాడు. మద్యం మత్తులో విచక్షణారహితంగా కొట్టటంతో.. భానుకు ఛాతిపై బలంగా దెబ్బలు తగిలాయి. దీంతో.. భాను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. భానును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టుగా నిర్ధారించారు.
అయితే.. భానుకు పోస్టుమార్టం అవసరం లేదని మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువచ్చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు కూడా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తాను కొట్టటం వల్లే కొడుకు చనిపోయాడన్న విషయాన్ని ఎవరికి చెప్పొద్దని భార్యను కూడా సైదులు బెదిరించాడు. తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా భాను మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే.. గ్రామస్తులకు అసలు విషయం తెలిసి.. వెంటనే పోలీసులకు చెప్పారు. ఇంకేముంది రంగంలోకి దిగిన పోలీసులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి భాను తండ్రి కొట్టటం వల్లే చనిపోయినట్టుగా తేలింది. పోలీసులు భాను మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి సైదులు మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa