గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డి సర్కారుపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సున్నితంగానే చురకలంటిస్తున్నారు. తాజాగా.. మీడియా సమావేశం నిర్వహించిన కూనంనేని సాంబశివరావు.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది నిరూపించుకోకపోతే.. ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవంటూ చురకలంటించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అదే పరిస్థితి ఎదురైందని సున్నితంగా హెచ్చరించారు. అమలు చేస్తున్న హామీలపై స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేసిన కూనంనేని.. అందులో చాలా వరకు అలాగే ఉన్నాయని తెలిపారు. దీని మీద వివరణ ఇచ్చిన తరువాతనే ఎన్నికలకు వెళ్తే మంచిదని కూనంనేని సలహా ఇచ్చారు.
మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కూడా కూనంనేని సాంబశివరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫ్యూడల్ వ్యవస్థ నుంచి మోదీ బయటకు రావడం లేదని దుయ్యబట్టారు. అక్షరాస్యత పెరిగేతేనే దేశంలో పురోగతి ఉంటుందని కూనంనేని సాంబశివ రావు అభిప్రాయపడ్డారు. ఉచితాలు అంటూ ప్రధాని మోదీ దేశ భవిష్యత్తును అపహస్యం చేస్తున్నారన్నారు. మోదీ వ్యాఖ్యలు దేశ స్థితిగతులకు అనుగుణంగా లేవని ఆరోపించారు. పరోక్ష టాక్స్ ద్వారా రూ.22 లక్షల కోట్లు వస్తే.. అందులో 90 శాతం పేదలే కడుతున్నారని.. బడా బాబులు కట్టిన 10 శాతం వల్ల దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని కూనంనేని వివరించారు.
పేదలు కట్టిన జీఎస్టీనే ప్రభుత్వాలకు ఆదాయం, బడ్జెట్ రూపాయల్లో వెళ్తున్నాయని కూనంనేని సాంబశివ రావు పేర్కొన్నారు. పేదలకు ఇస్తే వాటిని ఉచితాలు అంటారని.. లక్షల కోట్ల రూపాయలను సంపన్న వర్గాలకు చెందిన కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. భారతదేశంలో ఒక్క శాతం మంది చేతుల్లోనే 45 శాతం సంపద ఉంటే.. మిగతాదంతా పేదల చేతుల్లో ఉందని పేర్కొన్నారు. న్యాయమూర్తులు కూడా ఉచితాల మీద రాజకీయ నేతల్లాగా మాట్లాడుతున్నారని కూనంనేని సాంబశివ రావు అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa