ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2025, 07:43 PM

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం గురించి కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేసి మరింత ఆసక్తి పెంచారు.. ఆదివారం (ఫిబ్రవరి 16న) రోజున వరంగల్‌లో పర్యటించిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై, మోదీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏ ఒక్క బీసీ సంఘం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేతో ఏకీభవించట్లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు.


బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతునిస్తుందని తెలిపిన కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో సర్వే పూర్తయి, బీసీ సంఘాలు సమర్థిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదింపజేస్తామని కీలక ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ కులం గురించి సర్వే చేయాల్సిన అవసరం లేదని.. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే సర్వేలు చేయాలని కాంగ్రెస్ నేతలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.


ఈ క్రమంలోనే.. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి గురించి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారని కిషన్ రెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీజేపీకి నూతన రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడని స్పష్టం చేశారు. బిజీ షెడ్యూల్ వల్ల రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఆలస్యమవుతోందని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.


మరోవైపు.. బీఆర్ఎస్‌ పార్టీతో కలవాల్సిన అవసరం తమకు లేదని క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను నిలబెట్టేందుకు భయపడుతున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత సంబంధం ఉందని కీలక ఆరోపణలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారని.. ఇప్పుడు ఆయన కూడా అదేబాటలో నడుస్తున్నారని ఆరోపించారు. అందినకాడికి అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. భూములు అమ్మడం, సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.


వనరులు సమకూర్చుకునే అంశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు కిషన్ రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ కూడా లేదన్నారు. గుడ్డెద్దు వెళ్లి చేనులో పడ్డట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉందన్నారు. ఘాటుగానో, ఆవేశంగానో మాట్లాడితే ప్రజలు ఎక్కువ రోజులు భరించరని కిషన్ రెడ్డి తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa