ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెట్రో రెండో దశ.. ఆ 2 రూట్లలో అండర్ గ్రౌండ్ కారిడార్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2025, 07:33 PM

రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. అయితే.. ఈ మెట్రో రెండో దశలో సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఆయా మార్గాల్లో అండర్ గ్రౌండ్ కారిడార్లను నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రో కొత్త లేఅవుట్లను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డి సూచనల మేరకు హైదరాబాద్ మెట్రో సారథ్యంలో సాంకేతిక నిపుణులు, అధికారులు కొత్త మెట్రో మార్గాలను రూపొందించేందుకు ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించారు.


23 కిలోమీటర్ల మేర నిర్మించే ప్యారడైజ్- మేడ్చల్ కారిడార్‌, 22 కిలోమీటర్ల జేబీఎస్- శామీర్‌పేట్ ప్రతిపాదిత కారిడార్ అలైన్‌మెంట్లకు సంబంధించి అధికారులు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఇక.. జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి శామీర్ పేట్ మెట్రో కారిడార్లకు డీపీఆర్‌‌ల తయారీకై అవసరమైన వివిధ రకాల సర్వే పనులు జోరుగా సాగుతున్నాయని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.


డీపీఆర్‌ల తయారీకి ముఖ్యంగా ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్య పరీక్షలు, పర్యావరణ ప్రభావ అధ్యయనం లాంటి 3 రకాల అధ్యయనాలు అవసరమని మెట్రో అధికారులు గుర్తించారు. ట్రాఫిక్ సర్వేకి సంబంధించిన అధ్యయనంలో ఈ కారిడార్లలో ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ ప్రయాణాల సంఖ్య, భవిష్యత్తులో రోజువారీ ప్రయాణాల అంచనాలు, జంక్షన్ల వద్ద ప్రయాణికులు తీసుకునే మలుపులు, పాదచారుల సంఖ్య, వాహన ప్రయాణాలకు పట్టే సమయం, వాహన ప్రయాణాల్లో ఎంత శాతం మెట్రో రైలుకు మారే అవకాశం, వివిధ మెట్రో స్టేషన్లు ఏర్పాటయ్యే ప్రదేశాల ప్రయాణ సాంద్రత వంటి అనేక అంశాలు మెట్రో అధికారులు పరిశీలిస్తున్నారు.


ఇక.. పర్యావరణ ప్రభావ అధ్యయనంలో ప్రస్తుతం ఈ మార్గాల్లో ఉన్న గాలి పరిశుభ్రత, గాలిలో ఉన్న దూళికణాల శాతం, కాలుష్య కారకాల నిర్ధారణ, శబ్ద కాలుష్యం, నీటి వనరులు, వృక్ష, జంతుజీవాల జీవ వైవిధ్యం, జీవనాధారభ్రుతులపై ప్రాజెక్టు చూపే ప్రభావం వంటి అంశాలు పరిశీలన చేయవల్సి ఉంటుందని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.


ఇక.. భూసామర్థ్య పరీక్షల్లో భాగంగా ఈ మార్గాల్లో ఉండే వివిధ రకాల మట్టి, రాతి పొరల నమూనాలు, వివిధ నిర్మాణాలకు కావాల్సిన భూ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. భూగర్భంలో నిక్షిప్తమైన నీటి లెవెల్స్ అంచనాలు, భూకంపాలు ఏర్పడే అవకాశాలు వంటి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి మెట్రో స్తంభాలు, స్టేషన్లు, ఇతర నిర్మాణాలను ఎంత బలంగా డిజైన్ చేయాలో నిర్ణయిస్తారు. సాధారణంగా ప్రతి అర కిలోమీటర్‌కు ఒక బోర్ హోల్ చొప్పున భూసామర్థ్య పరీక్షల నమూనాలు తీసుకోవడం జరుగుతోంది. ఒక్కొక్క హోల్‌ను 50 నుంచి 100 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి పరిశీలించనున్నట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.


ఇప్పటికే హెచ్ఎండీఏ, జాతీయ రహదారుల సంస్థ కలిసి.. కొన్ని భూ సామర్థ్య అధ్యయనాలు చేపట్టగా.. ఇప్పుడు మెట్రో సంస్థ.. జేబీఎస్- మేడ్చల్ మార్గంలో 25 చోట్ల, జేబీఎస్- శామీర్ పేట మార్గంలో 19 చోట్ల ఈ భూసామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు మెట్రో ఎండీ తెలిపారు. వీటిలో మేడ్చల్ మార్గంలో 14 చోట్ల, శామీర్ పేట్ మార్గంలో 11 చోట్ల ఇప్పటికే పరీక్షలు కూడా పూర్తయ్యాయని ఈ నెలాఖరులోగా అన్ని ప్రాంతాల్లో పరీక్షలు పూర్తవుతాయని స్పష్టం చేశారు.


ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాఫీగా ప్రయాణించే విధంగా ఈ మెట్రో కారిడార్లను నిర్మించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ అధ్యయనాలు అన్నీ పూర్తి చేసి మార్చి నెలాఖరుకు శంషాబాద్ విమానాశ్రయం- ఫ్యూచర్ సిటీ మార్గంతో సహా ఈ మూడు మెట్రో మార్గాల డీపీఆర్లను సంపూర్ణ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి సమర్పిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాత డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa