నిర్మల్ జిల్లా బాసరలోని నిర్వహించిన సంత్ సేవాలాల్ 286వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క.. ఎస్టీల కోసం తెలంగాణలో మరో మూడు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. కొమరం భీం, సేవా లాల్, ఏకలవ్య పేరిట కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది ఒడ్డున నిర్వహించిన శ్రీ సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క ఎస్టీలకు గుడ్ న్యూస్ వినిపించారు. ఎస్టీల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. మైదాన ప్రాంతాల్లో సైతం ఐటీడీఏలు ఏర్పాటు చేసి ఆ ప్రాంత గిరిజనులకు అభివృద్ధికి ఫలాలు అందేలా చేస్తామని సీతక్క తెలిపారు.
మరోవైపు.. ఎస్టీల కోసం అదనపు ఇండ్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి సీతక్క తెలిపారు. పూర్వీకుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని తెలిపారు. ఈ క్రమంలోనే.. సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని బంజారా ఉద్యోగులకు సెలవులు ఇచ్చామని తెలిపారు. అన్ని వర్గాలు వైశమ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలని తెలిపారు. 286వ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు పౌర గాడ్ పీఠాధిపతి బాబుసింగ్ మహరాజ్, ఎంపీ గోడం నగేష్ పలువురు ఎమ్మెల్యేలు, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ ముఖ్య నాయకులకు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవ సమితి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
మరోవైపు.. శనివారం (ఫిబ్రవరి 15న) రోజున హైదరాబాద్ బంజారాహిల్స్లోని బంజారాభవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీతక్క.. బంజారా భాషను అధికారంగా గుర్తించి, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని సీతక్క తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్తో పాటు ఐటీడీఏలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు.
286 ఏండ్ల క్రితం జన్మించిన సంతు సేవాలాల్ ఎప్పటికీ చిరస్మరణీయుడేనని, సేవా సిద్ధాంతాలే ఆయనను సజీవంగా నిలుపుతున్నాయని వివరించారు. బంజారాలను సంచార జీవితం నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు, బంజారాల స్థిర నివాసం కోసం తండాలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి సేవలాల్ అని మంత్రి కొనియాడారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరవొద్దని, వేష భాషలను మర్చిపోవద్దని, బంజారా డ్రెస్సులు ధరించాలని సూచించారు. మన జాతి గురించి సగర్వంగా చెప్పుకోవాలని, జాతి ప్రయోజనాలు పొందుతున్నా.. జాతి గురించి చెప్పుకునేందుకు కొందరు ఇబ్బందులు పడుతుంటారని అన్నారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాన్ని ఎల్ బీ స్టేడియంలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతామని సీతక్క తెలిపారు.
సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాల నిర్వహణకు గతంలో కోటి రూపాయలు కేటాయిస్తే ఈసారి ప్రభుత్వం.. రూ.2 కోట్లు కేటాయించినట్టు సీతక్క తెలిపారు. ఎస్టీల సంక్షేమ కోసం బడ్జెట్లో రూ.17 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు వాడుకున్నారని సీతక్క ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa