స్వాతంత్రం వచ్చిన నాటినుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 2014 నుంచి 2024 వరకు కేవలం పదేళ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపిన నాడు కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని కేటీఆర్ స్పష్టంచేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలోనూ రాష్ట్రానికి దాదాపు 70 వేల కోట్ల వరకు అప్పు ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే బీఆర్ఎస్ పదేళ్ల పాలన తరువాత కూడా తెలంగాణను మిగులు బడ్జెట్ రాష్ట్రంగానే కాంగ్రెస్ కు అప్పజెప్పామని కేటీఆర్ తేల్చిచెప్పారు. అసలు అప్పులను, మిగులు బడ్జెట్ తో ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుగా తెచ్చిన ప్రతి పైసాను పెట్టుబడిగా మార్చి తెలంగాణ నేలపై విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిన విషయాన్ని యావత్ దేశం చూసిందని గుర్తు చేశారు. సమైక్యరాష్ట్రంలో తీవ్ర విధ్వంసానికి గురైన తెలంగాణ ముఖచిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా మార్చి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అప్పులున్నంత మాత్రాన ఒక రాష్ట్రం వెనకబడినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం సరైంది కాదని స్పష్టంచేశారు. తెచ్చిన అప్పులను దేనికోసం ఖర్చుపెట్టారనేదే అత్యంత కీలకమైన విషయమన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లలో తెచ్చిన 125 లక్షల కోట్ల అప్పుతో ఏం చేశారో చెప్పే పరిస్థితి లేదని, కానీ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పుతో దశాబ్దాలపాటు ఈ నేలను పట్టి పీడించిన తాగు, సాగునీటి కష్టాలను శాశ్వతంగా నిర్మూలించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మించామని తెలిపారు.వ్యవసాయంతోపాటు పారిశ్రామికరంగాన్ని వెంటాడిన చిమ్మచీకట్లను శాశ్వతంగా పారదోలేందుకు భారీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి, మరోవైపు రాష్ట్రంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులను ఉపయోగించిన విషయం తెలంగాణ సమాజానికి తెలుసని, వాటి ఫలితాలను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు.బీఆర్ఎస్ హయాంలో.. ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితికి లోబడి చేసిన అప్పును తప్పుగా చూపించే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేటిఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం లాగా తెచ్చిన అప్పులతో కార్పొరేట్ శక్తుల లక్షల కోట్ల లోన్లు మాఫీ చేయలేదనే విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుపెట్టుకోవాలని కోరారు. పంటల దిగుబడిలో పంజాబ్ నే తలదన్నే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే దానికి ప్రధాన కారణం.. తెచ్చిన అప్పులతో సంపద సృష్టించే బృహత్తర కార్యక్రమాలు చేపట్టడమేనని కుండబద్దలు కొట్టారు. అటు కేంద్ర బడ్జెట్ లో, ఇటు రైల్వే కేటాయింపుల్లో బీజేపీ సవతి ప్రేమ కనబరుస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే తెలంగాణలోని ఏడుమండలాలను, లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును లాక్కొని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం గొంతుకోసిన విషయాన్ని పదేళ్లు గడిచినా తెలంగాణ ప్రజలు మరిచిపోలేదని కేటిఆర్ పేర్కొన్నారు. కేంద్రం ఖజానా నింపే తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాను ఇవ్వాలని, విభజన హక్కులను నెరవేర్చాలని అడిగిన పాపానికి కేంద్ర మంత్రి పియూష్ గోయెల్, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa