ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ రిలీఫ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 07:34 PM

 రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు, రాధా కిషన్‌రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. హరీష్ రావు, రాధా కిషన్‌రావులపై.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ చేపట్టే వరకు ఈ పిటిషన్‌పై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు.. పంజాగుట్ట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సిద్దిపేట జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో పలు సెక్షన్ల కింద పంజాగుట్ట పోలీసులు.. హరీష్ రావు, రాధా కిషన్ రావు సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే 3 రోజుల క్రితం హరీష్ రావు పీఏను పోలీసులు అరెస్ట్ చేశారు.


అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని హరీష్ రావు, రాధాకిషన్‌ రావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో హరీష్ రావు, రాధాకిషన్‌ రావులను అరెస్ట్ చేయవద్దని గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడం కోసం సీనియర్ లాయర్‌ సిద్ధార్థ లూథ్రా వస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. అయితే ప్రస్తుతం సిద్ధార్థ లూథ్రా మరో కేసులో బిజీగా ఉన్నందున ఈ కేసులో వాదనలు వినిపించేందుకు సమయం కావాలని హైకోర్టును ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.


సిద్దిపేట జిల్లాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చక్రధర్‌ గౌడ్.. తన ఫోన్‌ను ట్యాపింగ్‌ చేశారని.. మాజీ మంత్రి హరీష్‌ రావు, రాధాకిషన్ రావులపై గతేడాది ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పంజాగుట్ట పోలీసులు.. హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సహా ముగ్గురి అరెస్ట్‌ చేశారు. ఈ ముగ్గురు నిందితులకు ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. తన ఫోన్‌ను ట్యాపింగ్‌ చేసి బెదిరింపులు, వేధింపులకు గురిచేశారని పిటిషనర్ చక్రధర్ గౌడ్ తెలిపారు. ఒక రైతుకు తెలియకుండా అతని పత్రాలతో హరీష్‌ రావు పీఏ వంశీకృష్ణ సిమ్‌కార్డు కొనుగోలు చేశారని.. ఆ సిమ్‌ను ఉపయోగించి తనకు బెదిరింపు కాల్స్‌ చేసి వసూళ్లకు పాల్పడ్డారని చక్రధర్‌ గౌడ్‌ ఆరోపించారు. ఇక ఈ కేసులో ఏ-1గా హరీష్‌ రావు, ఏ-2గా రాధాకిషన్‌ రావులు ఉన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa