ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరీష్ రావు చేతికి ముఖ్య బాధ్యతలు,,,కేసీఆర్ కీలక నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 07:44 PM

తెలంగాణలో మళ్లీ అధికారం తమదేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దాదాపు 6 నెలల తర్వాత.. తెలంగాణభవన్‌లో కేసీఆర్ అడుగుపెట్టారు. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక విషయాలపై గులాబీ శ్రేణులతో చర్చించారు. ఈ భేటీలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలోనే సిల్వర్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంవత్సరం పాటు నిర్వహించాలని పేర్కొన్నారు.


పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27వ తేదీన కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ప్లీనరీ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. మరోవైపు.. ఏప్రిల్ 10వ తేదీ నుంచే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టాలని తీర్మానించారు. ప్రతి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెడతామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించామని.. ఈ కమిటీలకు ఇంఛార్జ్‌గా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మహిళా కమిటీలు కూడా వేయనున్నట్లు కేసీఆర్ వివరించారు.


వీటితోపాటు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరి అంశాలపై నేతలతో కేసీఆర్‌ చర్చించారు. దీనిపై పార్టీ శ్రేణులకు పలు అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావించినప్పటినుంచి మొదలు ఇప్పటివరకు సుదీర్ఘ ప్రస్థానాన్ని పార్టీ నేతలకు గులాబీ బాస్ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం, అభివృద్ధి కోసం చేసిన కృషిని గులాబీ శ్రేణులకు వివరించారు.


ఈ సమయంలోనే అధికార కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. పాలనలో పూర్తిగా విఫలం అయిందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ప్రజల కోసం పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం బీఆర్‌ఎస్‌ మాత్రమే పోరాడగలదని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌కు మాత్రమే ప్రజల కష్టాలు తెలుసన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. కాంగ్రెస్‌ పార్టీ పాలనలో మళ్లీ వెనక్కి వెళ్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్.. మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని తేల్చి చెప్పారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని ఈ సందర్భంగా కేడర్‌కు పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa