ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివాజీ జయంతి వేడుకల్లో కరెంట్‌ షాక్‌తో ఒకరు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 07:46 PM

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. కాషాయ జెండా ఎగురవేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగిలింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా హిందు సంస్థలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో జబ్బపూర్ గ్రామంలోనూ యువత శివాజీ జయంతి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది.


వేడుకల్లో భాగంగా.. జెండా ఆవిష్కరణకు సిద్ధమయ్యారు. కాషాయ జెండా ఆవిష్కరణ క్రమంలో ఐరన్ పైప్ విద్యుత్ వైర్లకు తగలటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన లింగ ప్రసాద్ అనే యువకుడు స్పాట్‌లోనే చనిపోయాడు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలోనూ వడ్డే కర్ణాకర్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతో అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పోలీసులు తక్షణ సహాయక చర్యలు చేపట్టి మరింత ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టారు. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.


.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa