దేశంలో మహిళల రక్షణ కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ కోరారు. మహిళా రిజర్వేషన్లు కేంద్రం వెంటనే అమలు చేయాలని మోదీ సర్కారును అల్కాలాంబ డిమాండ్ చేశారు. సొమవారం (ఫిబ్రవరి 24న) గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన అల్కాలాంబ.. కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో 5 లక్షల మంది మహిళా కాంగ్రెస్లో ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. కాగా.. అందులో తెలంగాణ నుంచే లక్ష మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకూ లక్షా 4 వేల మంది తెలంగాణ మహిళా కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకున్నారన్నారు. ఈ విషయంలో.. దేశంలోనే తెలంగాణ నెంబర్.1 గా ఉందని అల్కాలాంబ హర్షం వ్యక్తం చేశారు.
కేంద్రంలో పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉండి మహిళల హక్కులపై పోరాడుతోందని అల్కాలాంబ చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సగం మహిళల పాత్ర ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.500 సిలిండర్ ఇస్తున్నారని.. ఇది దేశం మొత్తంలో కేవలం తెలంగాణలోనే ఇస్తున్నారని వివరించారు. తెలంగాణలో ఇప్పటికే మహిళలకు మూడు హామీలు నెరవేర్చామని... త్వరలోనే నాలుగో హామీ కూడా అమలు చేస్తామని పేర్కొన్నారు. దేశంలో మహిళా పెట్రోల్ బంక్ ఎక్కడా లేదని.. తెలంగాణలోనే మొట్ట మొదటిసారిగా మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటు అయిందని.. అందుకు కృషి చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ను అల్కాలాంబ కొనియాడారు.
తెలంగాణలో ప్రతి పోలింగ్ బూతులో ముగ్గురు మహిళలను నియమించడానికి మహిళా కాంగ్రెస్ సిద్ధమవుతోందని అల్కాలాంబ తెలిపారు. మహిళా కాంగ్రెస్ పూర్తిస్థాయిలో కార్యవర్గాన్ని ప్రకటించిందని.. అందులో అన్ని జిల్లా అధ్యక్షులన్నారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా, తెలంగాణ నుంచి మహిళలను ఢిల్లీలో ప్రియాంక గాంధీ సత్కరిస్తారని అల్కాలాంబ వివరించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి క్షేమం కోసం మహిళా కాంగ్రెస్ ప్రార్థిస్తుందని అల్కాలాంబ తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు మాత్రమేనని తెలిలారు. కాంగ్రెస్లో ఒకరికి ఒక పదవి అనే సిద్ధాంతం ఉందని తెలిపిన అల్కాలాంబ.. పార్టీ, ప్రభుత్వంలో మహిళా కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్తో మాట్లాడుతానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సభ్యత్వం లక్షకు చేరుకున్న నేపథ్యంలో.. జాతీయ మహిళా కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సునీతా రావుకు అల్కాలాంబ శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa