ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవన్నీ నిజమైతేనే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి: సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2025, 07:34 PM

తెలంగాణలో మరోసారి ఎన్నికల వాతావరణం ఏర్పడింది. ఈరోజే (ఫిబ్రవరి 24) ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగగా.. ఫిబ్రవరి 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా.. నిజామాబాద్‌లోని పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా.. మాజీ సీఎం కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఫాంహౌజ్‌లో కూర్చుని తమ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.


కేసీఆర్‌ అవసరం రాష్ట్రానికి లేదని.. చేసింది చాలు.. ఇక ఫాంహౌజ్‌లో విశ్రాంతి తీసుకొమ్మని ప్రజలు తీర్పునిచ్చారంటూ సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రజలు తిరస్కరించినా.. కేసీఆర్‌లో మాత్రం మార్పు రాలేదని మండిపడ్డారు. రాష్ట్రంతో పేగుబంధం తెంపుకుంటూ పార్టీ పేరు కూడా మార్చుకున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు.


అసలు ఎన్నికల్లోనే పోటీ చేయలేని వాళ్లకి తమను ప్రశ్నించే అర్హత ఉందా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏ అభ్యర్థికి ఓటెయ్యాలని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారో స్పష్టత ఇవ్వాలని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే ఆ పార్టీలో పోటీ చేసే అభ్యర్థులే దిక్కులేరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హతే లేదని ఎద్దేవా చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చాకే 55,163 నియామకాలు చేపట్టిందని చెప్పుకొచ్చారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి గ్రామీణ యువతలో ఉండే నైపుణ్యాలను బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు.


తెలంగాణ సాధనలో పట్టభద్రులదే కీలక పాత్ర అని రేవంత్ రెడ్డి తెలిపారు. పట్టభద్రులు ఆలోచించి ఓట్లేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో.. 55,163 నియామకాలు చేపట్టింది నిజమైతేనే కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని రేవంత్ రెడ్డి కోరారు. టాటా కంపెనీతో ఒప్పందం నిజమైతే హస్తం పార్టీ అభ్యర్థికి ఓటెయ్యండన్నారు. వీటితో పాటు.. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు నిజమైతేనే.. రైతులకు రుణ మాఫీ నిజమైతేనే, రైతు భరోసా పథకంలో భాగంగా ఏడాది రూ.6 వేలు ఇవ్వటం నిజమైతే, ఉచిత కరెంట్ ఇవ్వటం నిజమైతేనే, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చింది నిజమైతేనే.. కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa