దేశంలోనే మొట్టమొదటి 'లైఫ్ సైన్సెస్ పాలసీ'ని తెలంగాణలో తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు సులభతరమైన పారిశ్రామిక విధానం, అందుకు అవసరమైన మౌలిక సదుపాయలు కల్పన, అనుగుణమైన పాలసీ, తగిన సహకారాన్ని అందించడంలో తమ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుందని చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రతిష్టాత్మకమైన 'బయో ఆసియా -2025' రెండు రోజుల సదస్సును ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు.
అనంతరం ప్రసగించిన సీఎం.. బయో ఆసియా సదస్సు హైదరాబాద్ను ప్రపంచ లైఫ్సైన్సెస్ రాజధానిగా మార్చిందన్నారు. ఫార్మా, ఐటీ, డిజిటల్ హెల్త్ రంగాల్లో గడిచిన 25 ఏళ్లగా హైదరాబాద్ను ఒక పవర్ హౌజ్గా నిలబెట్టిందని చెప్పారు. ప్రపంచంలో పేరొందిన ఫార్మా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు ఎన్నో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని తెలిపారు. బయో సైన్సెస్లో పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న దార్శకనితతో తెలంగాణ ప్రభుత్వం ముందునుంచి పనిచేస్తోందన్నారు.
'జినోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నాం. హెల్త్కేర్ రంగం భవిష్యత్తును నిర్ధేశించడంతో పాటు ప్రపంచానికి మార్గదర్శనం చేసే కార్యక్రమంగా బయో ఆసియా దేశవిదేశాలను ఆకర్షిస్తోంది. తెలంగాణలో ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకోవాలని, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నాం. నిన్ననే ఆమ్జెన్ కంపెనీ హైదరాబాద్లో తన కార్యకలాపాలను విస్తరించింది. ప్రభుత్వ సహకారానికి ఇది నిదర్శనం. జర్మనీ కంపెనీ మిల్టెని బయోటెక్ జీనోమ్ వ్యాలీలో తన సెల్, జన్యు చికిత్సను ప్రారంభించింది. ఈ వేదికపై మరో 4 బహుళజాతి కంపెనీలను తెలంగాణ పర్యావరణ వ్యవస్థలోకి స్వాగతిస్తున్నాం. గతేడాది AI హెల్త్కేర్ సదస్సును కూడా విజయవంతంగా నిర్వహించాం.
దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. గతేడాది లైఫ్ సైన్సెస్ రంగంలో రూ. 40,000 కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించాం. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతంలో మాన్యుఫాక్చరింగ్ హబ్గా, ఫార్మా క్లస్టర్స్ అభివృద్ధి చేస్తున్నాం. తద్వారా 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది.
వచ్చే పదేళ్లలో తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే కాకుండా చైనా ప్లస్ వన్ ఆలోచనలకు సరైన ప్రత్యామ్నాయ కేంద్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం. నెట్ జీరో సిటీ కింద అనేక లక్ష్యాలను నిర్ధేశించాం. దేశ విదేశాల నుంచి బయో ఆసియా సదస్సుకు హాజరైన ప్రతినిధులందరికీ అభినందనలు. మీరంతా పెట్టుబడులకు తెలంగాణ అనువైన వేదికగా అవకాశాలను ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం'. అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa