ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ ఓట్లు ఎలా లెక్కిస్తారో తెలుసా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 06:04 PM

తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 27వ తేదీన చెరో మూడు చొప్పున మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా.. ఈ ఎన్నికలకు మార్చి 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. అయితే.. ఈ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే ప్రక్రియే కాదు.. ఆ ఓట్ల లెక్కింపు విధానం కూడా మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. ఓటు వేసేటప్పుడు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత అంటూ వరుస క్రమంలో ఎంత మందికైనా ఓటు వేసే వెసులుబాటు ఈ ఎమ్మెల్సీ స్థానాలకు ఉండగా.. ఆ ప్రాధాన్యతలే అభ్యర్థులను విజేతలుగా నిలబెట్టనున్నాయి. అసలు ఈ ప్రాధాన్యత ఓటుకు అంత ప్రియారిటీ ఏంటీ? మొదటి ప్రాధాన్యత ఓటుకు.. మిగతా ప్రాధాన్యత ఓట్లకు తేడా ఏంటీ? అసలు ఈ ఓట్లను ఎలా లెక్కిస్తారు..? ఇందులో ఎలిమినేషన్ ప్రక్రియ ఎప్పుడొస్తోంది.. ఎలా ఎలిమినేట్ చేస్తారన్న ముఖ్యమైన విషయాల గురించి సవివరంగా తెలుసుకుందాం..!


అయితే.. సాధారణ ఎన్నికల్లో అయితే.. ఈవీఎం మెషీన్లలో బటన్ నొక్కగానే మనం ఎవరికి ఓటు వేశామన్నది అందులో నిక్షిప్తమవుతుంది. అయితే.. ఇక్కడ ప్రాధాన్యతా క్రమంలో ఓట్లు వేస్తాం కాబట్టి.. కౌంటింగ్ ప్రక్రియ కాస్త వేరేగా ఉంటుంది. అయితే.. ఈ ఓటు వేసే క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేసేటప్పుడు నెంబర్లు మాత్రమే వేయాలి. అవి కూడా.. మధ్యలో అంకెలు మిస్సవకుండా వరుస క్రమంలో వచ్చేలా ప్రాధాన్యత ఓట్లు వేయాల్సి ఉంటుంది. 1, 3 వేసి 2 మర్చిపోయినా.. 1,2, 4 వేసి 3 నెంబర్ వేయకపోయినా.. నెంబర్లు వేయకుండా రైట్ మార్కులు పెట్టినా.. ఇలా ఏ చిన్న తప్పు చేసినా.. మీ విలువైన ఓటు చెల్లకుండా పోతుంది.


అయితే.. కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా.. పోలైన ఓట్లన్నింటిని పరిశీలించి.. చెల్లకుండా పోయిన ఓట్లను పక్కన పెట్టేసి.. కేవలం చెల్లుబాటు అయిన ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకుంది. అలా.. చెల్లుబాటు అయిన మొత్తం ఓట్ల సంఖ్యలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా.. ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ఉదాహరణకు.. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లు 1000 అనుకుంటే.. అందులో 501 ఓట్లు వచ్చిన అభ్యర్థే విజేత అన్నమాట.


అయితే.. ఈ ఎమ్మెల్సీ ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కిస్తుంటారు. ముందుగా మొదటి ప్రాధాన్యతా ఓట్లంన్నింటినీ లెక్కిస్తారు. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికైనా విజయానికి కావాల్సిన ఓట్ల సంఖ్య వచ్చిందా అని చూస్తారు. ఒకవేళ వస్తే.. అతన్నే విజేతగా ప్రకటిస్తారు. రానిపక్షంలో.. అసలు ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడే ప్రాధాన్యతకు ఉన్న ప్రియారిటీకి పని పడుతుంది.


మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థి గెలుపు మార్క్ చేరుకోకపోతే.. అప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. అభ్యర్థుల్లో ఎవరికో ఒకరికి విజయానికి కావాల్సిన ఓట్ల సంఖ్య వచ్చేవరకు ఈ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో.. మొదటి ప్రాధాన్యత ఓట్ల సంఖ్యను బట్టి ఆరోహణ క్రమంలో జాబితాను సిద్ధం చేస్తారు. ఈ జాబితాలో అతి తక్కువ ఓట్లు వచ్చిన (అన్ని ప్రాధాన్యత ఓట్లు లెక్కించినా గెలుపు మార్కు చేరుకోలేనంత తక్కువ ఓట్లతో చివరి స్థానాల్లో ఉన్న) అభ్యర్థులను గుర్తించి వరుసగా ఎలిమినేట్ చేస్తారు.


ఇక.. ఉప్పుడు లిస్టులో మిగిలిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఆ ఓట్లను ఆయా అభ్యర్థులకు జమ చేస్తారు. ఇలా కింద నుంచి పై వరకు ఇదే తరహాలో లెక్కించి.. ఈ ఓట్లను వారికి కలుపుతూ చివరి అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వస్తుంటారు. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లలో విజయానికి కావాల్సిన సంఖ్య వస్తే.. ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ రెండో ప్రాధాన్యత ఓట్లను కలిపినా గెలుపు మార్కును ఏ అభ్యర్థి చేరుకోకపోతే అప్పుడు మూడో ప్రాధాన్యత ఓట్లను ప్రియారిటీగా చూస్తారు. ఇలా.. జాబితాలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరో ఒకరు గెలుపు మార్కును చేరుకునే వరకు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే.. ప్రాధాన్యత ఓట్లకు అంత ప్రియారిటీ ఉంటుంది.


గతంలో జరిగిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా సందర్భాల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితాలు తేలకపోవటంతో.. రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారానే విజేతను ప్రకటించారు. కొన్ని ఎన్నికల్లో అయితే.. మూడు ప్రాధాన్యత ఓట్లు కూడా విజేతను నిర్ణయించటం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa