ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇనుప రాడ్లతో బద్దలు కొట్టి,,,రంగారెడ్డి జిల్లాలో ఏటీఎం చోరీ కలకలం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 06:11 PM

టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ దొంగతనాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక ఏరియాలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు కూడా తన పంథాలను మార్చుకొని.. కొత్త కొత్త ఆలోచనలతో అమాయకులను బురిడీ కొట్టించి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ ఓటీపీ లాంటివి ఇతరులతో పంచుకోవద్దని చెప్పినా.. చదువుకున్న వాళ్లు కూడా మోసపోతున్నారు. అయితే ఇటువంటి కేసులను పోలీసులు వీటిని చాలెంజ్ గా తీసుకొని కేసులను ఛేదిస్తున్నారు.. కానీ అన్ని సందర్భాల్లో కుదరడం లేదు.


తాళం వేసిన ఇళ్లు, ఏటీఎం, దుకాణాలు ఏది కనిపిస్తే అది.. ఒక రోజు ముందు ప్లాన్ చేసుకొని.. తర్వాత రోజు చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. తాజాగా ఓ ఏటీఎం భారీ చోరీ జరిగిన ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని రావిర్యాల ఏటీఎంలోకి దొంగలు చొరబడి కట్టర్ , ఇనుప రాడ్ల సాయంతో ఏటీఎంను బద్దలు కొట్టి.. భారీగా నగదు ఎత్తుకెళ్లారు. అసలు ఏం జరిగింది.. ఎంత నగదు దొంగలు ఎత్తుకెళ్లారు అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.


ఆదివారం తెల్లవారు జామున రావిర్యాల వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్దకు కారులో కొందరు దుండగులు వచ్చారు. ముందుగా సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నారు. సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి.. సైరన్ మోగకుండా సెన్సార్ వైర్లను కట్ చేశారు. తర్వాత తమతో పాటు తెచ్చుకున్న ఇనుప సామాన్లతో ఏటీఎం మిషన్ ను బద్దలు కొట్టారు. అందులో ఉన్న మొత్తం డబ్బును తీసుకొని పారిపోయారు. దొంగలు ఏటీఎంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి.. వెళ్లిపోయే వరకు పట్టిన సమయం కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే. ఈ లోపే వాళ్లు అనుకున్న పని కానిచ్చేశారు.


విషయం తెలుసుకున్న క్రైమ్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహేశ్వరం డీసీపీ సునితా రెడ్డి, ఏసీపీ రాజు ఘటనా స్థలంలోని ఏటీఎంలో చోరీ ఎలా జరిగిందనే విషయంపై అక్కడి సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. వాటి ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం బృందాలుగా ఏర్పడి దొంగల కోసం గాలిస్తున్నారు. అయితే ఏటీఎంలో ఎంత నగదు చోరీ చేయబడిందని బ్యాంక్ మేనేజర్ ను అడగ్గా.. రెండు రోజుల క్రితమే ఏటీఎంలో రూ.30 లక్షలు పెట్టినట్లు తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa