హైదరాబాద్ నగరం విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మౌళిక వసతుల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నగరంలో ట్రాఫిక్ ప్రధాన సమస్య కాగా.. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే నగరంలో కొత్త ఫ్లైఓవర్లు, అండర్పాసులు నిర్మించారు. ఇక ఉత్తర తెలంగాణ ప్రజలు హైదరాబాద్ నగరంలోకి ఈజీగా చేరుకునేందుకు జాతీయ రహదారి 44పై సికింద్రాబాద్ జంక్షన్ ప్యారడైజ్ నుంచి తాడ్బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డెయిరీఫాం వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ ఇప్పటికే ఈ పనులకు శంకుస్థాపన చేశారు.
తాజాగా ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఈ ఎలివెటేడ్ కారాడార్ నిర్మాణంలో భాగంగా.. బేగంపేట వద్ద సొంరగం నిర్మించాల్సి ఉంది. ఈ టన్నెల్ మార్గం పనులకు ఎయిర్పోర్టు అథారిటీ నుంచి తాజాగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొత్తం కారిడార్ పొడవు 5.40 కిలోమీటర్లు కాగా.. ఇందులో టన్నెల్ మార్గం 0.6 కిలోమీటర్లు ఉండనుంది. బోయినపల్లి కూడలి నుంచి బాలంరాయి రోడ్డును కనెక్ట్ చేస్తూ ఈ సొరంగ మార్గం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఎలివేటెడ్ కారిడార్ కోసం ప్రైవేటు ఆస్తులను అధికారులు గుర్తించారు. త్వరలో బాధితులకు నష్టపరిహారం అందజేయనున్నారు. రోడ్డుకు రెండు వైపులా 200 మీటర్ల వరకు వెడల్పు చేయాల్సి ఉంది. దీంతో ఆ మేరకు ఆస్తులను అధికారులు గుర్తించారు. కంటోన్మెంట్లో రక్షణశాఖ ఆస్తులను కూడా హెచ్ఎండీఏకు అప్పగించే ప్రక్రియ జరుగుతోంది.
కాగా, నేషనల్ హైవే 44పై రూ.1,580 కోట్ల వ్యయంతో ఈ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి తాడ్బండ్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫామ్ రోడ్డు వరకు 5.40 కిలోమీటర్ల డబుల్డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, జేబీఎస్ నుంచి శామీర్పేట ఔటర్ రింగు రోడ్డును కలుపుతూ 18.1 కిలోమీటర్ల మేర మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ రూట్లలో వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రస్తుతం నగరం నుంచి బయటకు వచ్చి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే 3 నుంచి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ జాతీయ రహదారి వైపు ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa