ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగ్గు వేస్తున్న మహిళను మంచి నీళ్లడిగి.. ఇంట్లో దూరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 12, 2025, 06:04 PM

రోజు రోజుకు జనాలు దారుణంగా తయారవుతున్నారు. మనుషులను నమ్మాలంటేనే భయమేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు. ఎవరిని నమ్మాలి.. ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయంలో పడిపోయో స్థాయికి సమాజం చేరిపోయింది. అయ్యో పాపమంటే పాపం తగుల్తుందో అన్నట్టుగా పరిస్థితి మారిపోతోంది. అచ్చం అలాంటి ఘటనే చోటుచేసుకుంది. హైదరాబాద్‌‌లో కేపీహెచ్‌బీలో. కేపీహెచ్‌బీ టెంపుల్ బస్‌స్టాప్‌ సమీపంలో పొద్దు పొద్దున్నే ఓ వ్యక్తి చేసిన పని.. ఇప్పుడు స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.


బుధవారం (మార్చి 12) రోజు.. ఉదయం 6 గంటలు.. ఓవైపు గుళ్లోని మైకులో మోగుతున్న సుప్రభాతం వినిపిస్తోంది. అప్పుడప్పుడే నగరం మెల్లిగా మేల్కొంటోంది. ఎప్పటిలాగే ఆ మహిళ కూడా లేచి చకచకా ఇంటి పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇంటి గేటు ముందు నీళ్లు చల్లి ముగ్గు వేస్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తి మంకీ క్యాప్ పెట్టుకుని అటుగా వెళ్తూ.. ఇంటి ముందు ఆగాడు. "అమ్మా.. కొంచెం మంచినీళ్లిస్తారా..?" అంటూ బాటిల్ చూపించాడు.


"పొద్దుపొద్దున్నే ఎక్కడికో వెళ్తున్నాడో.. లేదా ప్రయాణం చేసి వస్తున్నాడో.. పాపం దాహమైతున్నట్టుంది.. చలికి వస్తున్నాడు కాబోలు.. ముఖానికి మంకీ క్యాప్ పెట్టుకున్నాడు." అని మనసులో అనుకుంటూనే.. "ఇస్తాను బాబు ఒక్క నిమిషం" అంటూ.. అతనికి సమాధానం చెప్పి.. ఆ మహిళ ముగ్గు గిన్నె మెట్లపై పెట్టి నీళ్లు తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్లింది. అదే సమయంలో ఆ మంకీ క్యాప్ వ్యక్తి.. చేతిలో బాటిల్ పట్టుకుని.. తీసి ఉన్న గేటులో నుంచి నేరుగా ఇంటి గుమ్మం వద్దకు వెళ్లాడు. పరదాను పక్కకు జరిపి లోపలికి తొంగి చూస్తూ.. "అమ్మా.. ఇదిగో బాటిల్.." అని అందించాడు.


అదే సమయంలో ఇంట్లో పరిస్థితి ఏంటని గమనించాడు. ఇంకా ఎవరూ లేవనట్టున్నారు.. ఆమె ఒక్కతే కనిపించింది. ఇదే సరైన సమయం అనుకున్నాడు. నేరుగా లోపలికి దూరి.. బాటిల్‌లో నీళ్లు నింపుతున్న మహిళ దగ్గరికి వెళ్లి.. ఆమె మెడలో ఉన్న బంగారం లాక్కుని ఒక్క ఉదూటున బయటకు దూకి.. పరుగులు పెట్టాడు. క్షణాల్లో జరిగిన ఈ చర్యతో.. ఆ మహిళ ఒక్కసారిగా షాక్ అయ్యింది. చేతిలో అతనిచ్చిన బాటిల్‌తోనే ఆమె కూడా బయటికి పరుగులు తీసింది. ఆ దుండగుడు వెళ్తూ వెళ్తూ తెలివిగా గేటు దగ్గరికి మూసేయటంతో.. ఆమె తోసుకుని వెళ్లేలోపు ఆ దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మొత్తం వ్యవహారం.. ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది.


  ఉదయం సమయంలో ముగ్గురు వేళ్తున్న సమయంలో ఓ వ్యక్తి వచ్చి మంచినీళ్లడిగాడని.. తీసుకొచ్చేలోపే తనవెంటే ఇంట్లోకి వచ్చి.. మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్లిపోయాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా.. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa