ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 06:02 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. చాలా అంశాలు ప్రస్తావించారు. ముందుగా గవర్నర్‌ జిష్ణుదేవ్ శర్మకు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించారని.. కానీ గవర్నర్‌ను గౌరవించే బాధ్యత తమపై ఉందని చెప్పుకొచ్చారు. ఈ క్రమలోనే.. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.


తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే సభకు రాకుండా కేసీఆర్‌ ముఖం చాటేస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తప్పులు, అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేస్తే ఆ శిక్షను ప్రజలు అనుభవించాలా అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా ఆ మామాఅల్లుళ్లు డ్యాన్సులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎక్కడ ప్రమాదం జరిగినా వాళ్ల కళ్లలో మెరుపు కనిపిస్తోందన్నారు. పైశాచికత్వంలో ఉగాండా అధ్యక్షుడితోనే పోటీ పడుతున్నారంటూ చురకలంటించారు. బీఆర్‌ఎస్‌ నేతలు మాటకు ముందు స్టేచర్‌.. మాటకు తర్వాత స్టేచర్‌ అంటున్నారన్న రేవంత్ రెడ్డి.. స్టేచరే ముఖ్యమా స్టేట్‌ ఫ్యూచర్‌ వద్దా.. అంటూ ప్రశ్నించారు.


కేసీఆర్‌ దగ్గర మిగిలింది ప్రతిపక్ష సీటు మాత్రమేనని.. ఆ సీటుతో తామేమి చేసుకుంటామని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అది హరీశ్‌ రావుకో, కేటీఆర్‌కో కావాలని తమకు కాదని తెలిపారు. తాను చేసిన స్ట్రెచర్‌ కామెంట్స్.. కేసీఆర్‌ను ఉద్దేశించే చేశానంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాపు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పార్టీ మార్చురీలో ఉందని.. అందులో తప్పేం ఉందంటూ విమర్శించారు. కేసీఆర్ చెడును తాను ఎందుకు కోరుకుంటానని ఆయన వందేళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు. ఆయన అక్కడే ప్రతిపక్షంలో ఉండాలని.. నేను ఇక్కడే అధికారంలో ఉండాలన్నారు. కేసీఆర్‌ సభకు రావాలని కోరుకున్నారు. ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలిగించమని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సభకు వచ్చినరోజే కృష్ణా జలాల అంశంపై చర్చ పెడతామని అని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.


కేసీఆర్‌ హయాంలోనే కృష్ణా బేసిన్‌ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా నీటి విషయంలో కేసీఆర్‌ సంతకం చేసి తెలంగాణకు మరణశాసనం రాశారని మండిపడ్డారు. ఈ విషయంలో తమ తప్పు ఉందని నిరూపిస్తే సభ సాక్షిగా కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌ నేతలకు క్షమాపణ చెబుతానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చిన రోజే కృష్ణా జలాలపై చర్చ పెడతానని.. లెక్కలతో సహా నిరూపిస్తానన్నారు. దీనిపై.. చర్చకు సిద్దమా అంటూ బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి సవాల్‌ విసిరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa