హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో అత్యాధునిక స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తికాగా.. ఈ నెలాఖరులోగా ఈ సెంటర్ అందుటాబులోకి రానున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. రూ.45 కోట్ల వ్యయంతో ఈ సెంటర్ ఏర్పాటు చేయనుండగా.. నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ నెలాఖరులో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సెంటర్ను ప్రారంభించనున్నారు. ఈ సెంటర్లో అత్యాధునిక సౌకర్యాలు, కొత్త టెక్నాలజీతో ఈ సెంటర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ప్రస్తుతం గవర్నమెంట్ హాస్పిటల్స్లో నిమ్స్ మాత్రమే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లకు కేంద్రంగా ఉంది. గాంధీ ఎస్ఓటీసీ అందుబాటులోకి వస్తే, రాష్ట్రంలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లకు ఒక ముఖ్యమైన కేంద్రం అవుతుంది. దీని ద్వారా పేద ప్రజలకు కూడా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వస్తుంది. ఇదివరకు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ పేద ప్రజలకు అందుబాటులో లేదు. ఎస్ఓటీసీలో పేషెంట్లకు, డాక్టర్లకు మంచి సౌకర్యాలు ఉంటాయి. ఇది కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఉంటుంది.
కిడ్నీ, లివర్, లంగ్స్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్లకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లు ఇక్కడ ఉన్నాయి. రెండు ఆర్థోపెడిక్, ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్లు కూడా ఉన్నాయి. మూడు పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేశారు. డోనర్లు, రిసీవర్లకు వేర్వేరు ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. వాటికి ప్రత్యేక ఎంట్రీలు కూడా ఉంటాయి. ఆపరేషన్ థియేటర్ నుంచి ఆడిటోరియంలోకి 4కే వీడియో క్వాలిటీతో లైవ్ ప్రసారం చేసే ఏర్పాటు ఉంది. ఆడిటోరియంలో వన్ వే వీడియో, టు వే ఆడియో సౌకర్యం ఉంటుంది. వైద్య విద్యార్థులు ఆడిటోరియం నుంచి ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లను లైవ్లో చూడవచ్చు. డౌట్లు ఉంటే ఆడియో ద్వారా డాక్టర్లను అడిగి తెలుసుకోవచ్చు. స్టెరిలైజేషన్ రూమ్, సప్లై రూమ్ కూడా ఉన్నాయి. ట్రాన్స్ప్లాంట్ సెంటర్కు ప్రత్యేకంగా రెండు లిఫ్టులు ఉంటాయి.
గాంధీ హాస్పిటల్లో ఎస్ఓటీసీ కట్టాలని 2017లో అనుకున్నారు. కానీ పనులు మొదలు కాలేదు. 2022 నుంచి ఎస్ఓటీసీ పనులు మొదలయ్యాయి. మొదట నాలుగు ఆపరేషన్ థియేటర్లే అనుకున్నారు. ఆ తర్వాత ఆర్థోపెడిక్, ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో నిర్మాణ ఖర్చును రూ.35 కోట్ల నుంచి రూ.45 కోట్లకు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్గాన్ డొనేషన్ను ప్రోత్సహించడానికి చట్టంలో మార్పులు చేసింది. అవయవ దానంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa