భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి (బీటీపీఎస్) రైలు మార్గం ఏర్పాటు కారణంగా భూములు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పరిహారం తీసుకోని నిర్వాసితులకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ నిర్వాసితులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల చాలా కాలంగా ఎదురుచూస్తున్న నిర్వాసితులు సొంతంగా ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం లభించనుంది. ఇటీవల రాజీవ్ యువ వికాస యోజన కింద అర్హులైన యువత నుంచి దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే.. ప్రభుత్వం దీనిపై కసరత్తు ప్రారంభించింది. ఈ స్కీమ్కు దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 14వ తేదీతో ముగిశాయి.
మణుగూరు నుండి బీటీపీఎస్కు బొగ్గు రవాణా కోసం రైలు మార్గం నిర్మించాలని 2019లో నిర్ణయించారు. ఇందుకోసం సాంబాయిగూడెం, రామానుజవరం, కొండాయిగూడెం గ్రామాలకు చెందిన 104 మంది రైతుల నుండి భూమిని సేకరించారు. అయితే.. తమకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ రైతులు అప్పటి నుండి పరిహారం తీసుకోలేదు.
రైతుల నుండి సేకరించిన భూమి చాలా తక్కువగా (5 నుండి 20 గుంటల వరకు) ఉండటంతో ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. దీనివల్ల రైలు మార్గం పనులు కూడా ఆలస్యమవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించింది. నిర్వాసితులకు రాజీవ్ యువ వికాసం పథకంలో మొదటి ప్రాధాన్యత కల్పించనుంది.
రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైలు మార్గం నిర్వాసితులు రూ. 4 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ రుణంలో 70 శాతం వరకు రాయితీ లభిస్తుంది. మిగిలిన 30 శాతం లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఈ 30 శాతం మొత్తాన్ని జెన్కో సంస్థ చెల్లించనుంది. దీని ప్రకారం.. నిర్వాసితులు కోల్పోయిన భూమికి పరిహారంతో పాటు, పునరావాసం మరియు పునస్థాపన (ఆర్అండ్ఆర్) కింద రూ. ఒక లక్ష.. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రూ. 4 లక్షలు పొందనున్నారు.
ఈ ఆర్థిక సహాయంతో నిర్వాసితులు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లభిస్తుంది. భూమిని కోల్పోవడం, పంట లేకపోవడం, పరిహారం తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులకు ప్రభుత్వం ఈ విధంగా చేయూతనిస్తోంది. నిర్వాసితులకు ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్థానిక మండల తహసీల్దార్ రాఘవరెడ్డి తెలిపారు. ఇంకా ఎవరైనా నిర్వాసితులు దరఖాస్తు చేసుకోని ఉంటే తమకు తెలియజేయాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa