ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కర్రెగుట్టలు' ప్రాంతంలో.. 38 మందికి పైగా మావోయిస్టులు మృతి..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 06:50 PM

తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్ట ప్రాంతంలో మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా భద్రతా బలగాలు రహస్యంగా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కూంబింగ్ కార్యకలాపాలు కొనసాగుతుండగా.. ఆపరేషన్ వివరాలను ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలిసింది. ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం.. దాదాపు 38 మంది మావోయిస్టులు మృతి చెందారు.భద్రతా బలగాలు అధునాతన ఆయుధాలు, సాటిలైట్‌లు, డ్రోన్ల సహాయంతో ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. హెలీకాప్టర్లతో గగనతలంలో నుంచి మావోయిస్టుల మీద బాంబుల వర్షం కురిపిస్తున్నారు.


కర్రెగుట్ట ప్రాంతాన్ని మూడువైపులా చుట్టుముట్టిన భద్రతా దళాలు మావోయిస్టులకు తప్పించుకునే మార్గం లేకుండా చేశాయి. ఈ ఆపరేషన్‌లో దాదాపు 10 వేల మంది భద్రతా సిబ్బంది మోహరించగా.. అడవి ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టుల నుంచి బలమైన ప్రతిఘటన ఎదురైనప్పటికీ భద్రత దళాలు సమర్థవంతంగా ముందుకు సాగుతున్నాయి. కాల్పులు, బాంబుల ధ్వని కారణంగా సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భద్రతా బలగాల భారీ దాడితో మావోయిస్టు శిబిరాలు ధ్వంసమైనట్లు తెలిసింది. కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.


కాగా, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా సరిహద్దుల్లో కర్రెగుట్టల అటవీ ప్రాంతం ఉంటుంది. గత కొన్ని వారాలుగా కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. అంతేకాకుండా, వారు కొత్తగా రిక్రూట్‌మెంట్లు చేస్తున్నట్లు, విధ్వంసక చర్యలకు పాల్పడేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ కూంబింగ్‌ను నిర్వహిస్తున్నాయి.


తెలంగాణ పోలీసుల ప్రత్యేక బలగాలు (గ్రేహౌండ్స్), కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఛత్తీస్‌గఢ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), రెండు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. భద్రతా బలగాలు కర్రెగుట్టల అటవీ ప్రాంతంలోకి పలు బృందాలుగా చొచ్చుకెళ్లాయి. అడుగడుగునా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో దాదాపు 38 మంది మరణించగా.. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa